డబుల్ బీటీ రోడ్డు ధ్వంసం.. ప్రమాదాలకు నిలయంగా మార్గం

by Dishanational2 |
డబుల్ బీటీ రోడ్డు ధ్వంసం.. ప్రమాదాలకు నిలయంగా మార్గం
X

దిశ, మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచేర్ల బ్లాక్-1 ఓసీపీ ప్రాజెక్ట్ కోల్ మైనింగ్ వల్ల ఎమ్మార్ ప్రైవేట్ కంపెనీ పనితీరుతో ఇక్కడి ప్రజలు సుఖవంతంగా జీవించలేక నిత్యం ప్రమాదాలకు, ఓసీపీ బాంబ్ బ్లాస్టింగ్‌లతో దుమ్ముధూళి, వాయు కాలుష్యం సోకి వివిధ రోగాలకు గురవుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. పర్యావరణంతో పాటు పంటలను కూడా దెబ్బతీస్తుంది. మానవులు, జంతువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. ఓపెన్ కాస్ట్ తవ్వకాలతో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ స్థానికులు మొరపెట్టుకున్నా ఉన్నత అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

తాడిచర్ల గ్రామం నుండి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మం పల్లి మానేరు బ్రిడ్జి నుండి ఉన్న డబుల్ బీటీ రోడ్డును ఎమ్మార్ ప్రైవేట్ కంపెనీ వారు ధ్వంసం చేసి ప్రభుత్వ నిధులను మట్టిపాలు చేశారు. తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించడంతో తాగు, సాగు గ్రౌండ్ నీటి పైపులు పగిలి ఆ రోడ్డుపై ప్రతిరోజు భారీ స్థాయిలో నీటి వరద చేరి బురదమయంగా మారడంతో వచ్చిపోయే ప్రయాణికులకు, పొలం పనులకు వెళ్లే రైతులకు ప్రాణసంకటంగా మారిoది. ఈ మట్టి రోడ్డుపై రాత్రి, పగలు ద్విచక్ర వాహనాలు, కార్లు బూరద నీటితో అదుపుతప్పి ప్రమాదాలకు గురైనా క్షతగాత్రులను పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తున్న ఎమ్మార్ ప్రైవేట్ కంపెనీ ఆడిందే ఆట పాడిందే పాటకు జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కొమ్ము కాస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మట్టి రోడ్డు పక్కనే భారీ దుమ్ము, నీటి బురదతో రోడ్డు పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రమాదాలకు గురై తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలవుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం పల్లి మానేరు బ్రిడ్జి నుండి పెద్దతూoడ్ల కిషన్ రావుపల్లి వరకు దాదాపుగా రూ. 13 కోట్ల పైచిలుకు ప్రభుత్వ నిధులతో డబుల్ బీటీరోడ్‌ను నిర్మించారు. కాగా టీఎస్ జెన్కో బౌoడ్రీలో ఉన్న మూడు కిలోమీటర్ల డబుల్ బీటీ రోడ్డును ముందుగా ధ్వంసం చేయకూడదని. మరో బీటీ రోడ్డు నిర్మాణానికి 2.7 కిలోమీటర్లకు దాదాపుగా రూ. 12వందల లక్షల నిధులు ఆర్అండ్‌బీ శాఖకు చెల్లించి నూతన రోడ్డు నిర్మాణం తద్వారా పాత రోడ్డు ధ్వంసం చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ ఆదేశాలను ఉల్లంఘించిన ఎమ్మార్ ప్రవేట్ కంపెనీ ప్రతినిధులపై చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల అండ ఎమ్మార్ ప్రైవేట్ కంపెనీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నా జిల్లా, మండల స్థాయి అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకో కపోవడం వెనుక ఆంతర్యo ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజు ఈ మట్టి రోడ్డు గుండా ప్రయాణించే ఇద్దరు లేదా ముగ్గురు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని. గాదంపల్లి‌కి చెందిన బిరుదు రమేష్ కాలు విరిగి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అదేవిధంగా తాడిచర్ల గ్రామానికి చెందిన జనగామ అనిల్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు గుండా ప్రయాణించే ప్రమాద బాధితులు ఎంతోమంది ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎమ్మార్ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులపై చర్యలు తీసుకొని ప్రమాదాలకు గురైన క్షత్ర గాత్రులను ఆర్థికంగా ఆదుకోని వెంటనే బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed