నాడు నక్సల్స్.. నేడు పొలిటికల్ లీడర్స్.. రగులుతోన్న కక్షలు

by Disha Web Desk |
నాడు నక్సల్స్.. నేడు పొలిటికల్ లీడర్స్.. రగులుతోన్న కక్షలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఒకప్పుడు నక్సల్స్‌కు పెట్టని కోటగా ఉన్న ఆ ప్రాంతం ప్రాబల్యం తగ్గగానే ప్రశాంతంగా మారినప్పటికీ రాజకీయ వైరుధ్యంతో అల్లకల్లోలంగా మారింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టింగల ప్రభావంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అతలాకుతలం అయింది. జనశక్తి నక్సల్స్ కంచుకోటగా ఉన్న ఎల్లారెడ్డిపేట మండలం నాడు కల్లోల ప్రాంతంగా ఉండేది. ఆ తరువాత జనశక్తి ఉనికి పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. తాజాగా బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య సోషల్ మీడియాలో చేసుకున్న ఛాటింగ్ వ్యక్తిగత దూషణలకు, బూతు పురాణం వరకూ వెల్లడంతో ప్రతీకారం తీసుకునే పరిస్థితికి చేరుకున్నాయి ఇక్కడి పరిస్థితులు.

చాలా కాలంగా వార్...

సైద్ధాంతిక వైరుధ్యం ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య చాలా కాలంగా సోషల్ మీడియా వేదిక మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల ప్రధాని మోడీ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించగా, దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను సెంట్రల్ లైటింగ్ పోల్స్ కు ఊరివేసి వేలాడదీశారు. ఈ ఘటన తరువాత ఇరుపార్టీల నాయకుల మధ్య వార్ మరింత సీరియస్ అయిందని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు కాస్తా బూతు పురాణం ఉపయోగించుకునే వరకూ వెళ్లాయి. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది.

అవకాశం కోసం ఎదురు చూసుకుంటున్న ఇరు పార్టీల నాయకులు ఏకంగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లోనే యుద్ధం చేసుకోవడం సంచలనం కల్గించింది. సోషల్ మీడియాలో ఇరు పార్టీల నాయకులు చేసిన ఛాటింగ్స్ ను చూసిన కొంతమంది రాజకీయాలు కండువాలు కప్పుకునే వరకే ఉండాలి, అందరం ఒకటే ప్రాంతం వారం ఇంత దారుణంగా మాట్లాడుకోవడం సరికాదని సూచించినా పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయారు. తమ పంథామే నెగ్గాలన్న యోచనతో వీరు చేసుకున్న కౌంటర్ ఛాటింగ్‌లు చివరకు కేసుల వరకూ చేరిందన్నది వాస్తవం.

అయితే శుక్రవారం బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన విషయం టీఆర్ఎస్ నాయకులకు సమాచారం లీక్ కాకుంటే రణరంగం సాగేది కాదంటున్న వారూ లేకపోలేదు. స్టేషన్లో ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులు విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే వారు కానీ ఇరు పార్టీల నాయకులు స్టేషన్ కు చేరుకోవడం వల్ల అంతా రచ్చరచ్చ అయింది. ఫిర్యాదు ఇచ్చే ప్రక్రియతో సరిపెడితే ఈ అంశం గోటితో పోయేది కానీ దాడులకు దిగడంతో ఇప్పుడు గొడ్డలి వరకూ తెచ్చుకున్నట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చర్చనీయాంశంగా మారిన అంశం..

ఎల్లారెడ్డిపేటలో పరస్పర దాడుల వ్యవహారం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని వర్గాలూ ఈ ఘర్షణ గురించి చర్చించుకున్నారు. పోలీసులు కేసులు పెట్టినప్పటికీ అసలేం జరిగింది..? దాడులకు కారణాలేంటీ అన్న విషయం గురించి మాట్లాడుకున్నారంటే ఎల్లారెడ్డిపేట దాడుల గురించి ఏ స్థాయిలో ప్రచారం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఈ ఘర్షనలు మాత్రం రానున్న కాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు.

23 మంది అరెస్ట్...

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ తో పాటు, మండల కేంద్రంలో జరిగిన పలు ఘటనల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీకి చెందిన 23 మందిని శనివారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Next Story