'టాస్క్ ఫోర్స్ వ్యూహం' చతికిల పడిందా..?

by Dishanational2 |
టాస్క్ ఫోర్స్ వ్యూహం చతికిల పడిందా..?
X

దిశ, నర్సంపేట : ప్రభుత్వ భూముల్ని కాపాడే ఉద్దేశ్యంతో, అక్రమ కట్టడాల కూల్చివేత ప్రధాన లక్ష్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ టీం చతికిలబడినట్లు డివిజన్ వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సంపేట ఆర్డీవో పవన్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ లో నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ విద్యాధర్, టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, పట్టణ సీఐ పులి రమేష్ సభ్యులుగా డివిజన్ లో అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటైంది. ఇదిలా ఉండగా టాస్క్ ఫోర్స్ బృందం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో తీసుకుంటున్న చర్యలు అనుకున్న లక్ష్యాలకు చేరుకోవట్లేదన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ. కొన్ని నెలలుగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

ఆదేశాలు బేఖాతరేనా..?

నర్సంపేట పట్టణ శివారులో వరంగల్ వెళ్లే మార్గంలో ఉన్న అయ్యప్ప గుడి ఎదురుగా సర్వే నెంబర్ 709/అ లో 12 గుంటల ప్రభుత్వ భూమి ( లావాణి పట్టా) ఉంది. ఈ 12 గుంటల భూమి అంటే సుమారు 1450 గజాల స్థలం ఇది. నర్సంపేట - వరంగల్ ప్రధాన రహాదారి పక్కనే ఉండటంతో దాని విలువ ప్రస్తుతం గజానికి రూ. 50 వేలు నడుస్తున్నప్పటికీ కుల్లుగుత్తగా 40 వేల రూపాయలు కాగా, సుమారు ఈ 12 గుంటల భూమి కాస్తా రూ. 5 కోట్లకు పైగానే పలుకుతోంది. దీంతో ఈ స్థలంపై కబ్జా వాసుల కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఈ స్థలంలో ఓ షెడ్ వేశారు. ఈ విషయం కాస్త గత నెల టాస్క్ ఫోర్స్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ టీం కాస్త కబ్జాకు గురైన ప్రాంతానికి వెళ్లి సదరు వ్యక్తులకు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది గడచి దాదాపుగా నెల కావస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో అత్యున్నత స్థాయి బృందం జారీ చేసిన ఆదేశాలు కావడంతో ప్రభుత్వ భూముల కబ్జాకు అడ్డుకట్ట పడిందని నర్సంపేట పట్టణవాసులు భావించారు. కానీ వారి ఆశలు అడియాశాలయ్యాయి. షెడ్ తొలగించడం పక్కన పెట్టి.. మిగతా నిర్మాణాలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు.

ఎకరాల్లో భూమి మాయం..

నర్సంపేట పట్టణంలో ఒకప్పుడు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. సర్వే నెంబర్ 111, 702, 709, 710 లు మరికొన్ని సర్వే నెంబర్‌లలో ప్రభుత్వ భూమి అనేది. అయితే ఇది గతం. ఇప్పుడు ప్రభుత్వ భూముల చిట్టా కేవలం ప్రభుత్వ సైట్‌లలోనే దర్శనమిస్తోంది. భౌతికంగా మాత్రం కనపడే పరిస్థితి దాదాపుగా కనుమరుగయ్యిందని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కారణం ఇదేనా..?

ఇటీవల తెలంగాణ సర్కార్ ఎటువంటి ప్రభుత్వ భూమైన, లావాణి పట్ట భూమైన, ఇంకా ఎలాంటి భూమి ఉన్నా జీవో నెంబర్ 58,59ల ప్రకారం 100 గజాల లోపు ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే దానిని రెగ్యూలరైజ్ చేసి ఆ భూమిని ఆ నిరుపేద వ్యక్తికి పట్టా భూమికి మార్చాడానికి తీసిన జీవోలు విడుదల చేశారు. దీంతో నర్సంపేట పట్టణంలో అనేక మంది నిరుపేదలు 50 గజాల నుంచి 120 గజాల వరకు ఇండ్లు వేసుకొని ఉన్నారు. ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా కేటీఆర్‌తో మాట్లాడి నర్సంపేట ప్రజల సౌకర్యార్దం 58,59 జీవోలను వర్తింప చేసేలా కృషి చేశారు. దీంతో పేద ప్రజల కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇదే ఆసరాగా భావించిన 12 గుంటల భూమి కలిగిన వ్యక్తి ఏకంగా అదే 58,59 జీవోలతో ఉన్న లావాణి భూమిని పట్టా భూమిగా మార్చుకోవచ్చని పథకం పన్నాడని నర్సంపేట పట్టణంలో చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ భూముల్ని కాపాడాలి

నర్సంపేట పట్టణ పరిధిలో ఒకప్పుడు వందల ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి రాను రాను కబ్జాకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత లక్ష్యంగా ఏర్పడిన మున్సిపాలిటీ టాస్క్ ఫోర్స్ బృందం అయినా ఈ కబ్జాదారులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని పలువురు మేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు.








Next Story

Most Viewed