రైతులకు శుభవార్త.. పూర్తిస్థాయిలో రుణమాఫీ.. ఎప్పుడంటే..?

by Dishafeatures2 |
రైతులకు శుభవార్త.. పూర్తిస్థాయిలో రుణమాఫీ.. ఎప్పుడంటే..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాదిలోపు రైతుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహా జనసభకు ఆయన హాజరై మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అంతేకాదు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేసి, 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులు మంచి లాభాలు గడిస్తున్నారని మంత్రి వెల్లడించారు. రైతులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు.

ఈ కారణంగా రైతులు అప్పులు చేసే పరిస్థితులు తగ్గిపోయాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు రూ.36వేలలోపు ఉన్న రుణమాఫీ పూర్తయిందన్నారు. రూ.36 నుంచి 75వేలలోపు ఉన్న రుణాల మాఫీ ఈ ఏడాది పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది లోపు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. కరోనా కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తడం వల్ల రుణమాఫీ కొంత ఆలస్యం జరిగిందని మంత్రి తెలిపారు. రైతులు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగ పరచుకుని డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి మంచి లాభాలు గడించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed