మండుటెండలో 'పది' పరీక్షలా?

by Disha Web Desk 2 |
మండుటెండలో పది పరీక్షలా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్షల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండుటెండల్లో ఎగ్జామ్స్ ఎలా పెడతారంటూ ప్రభుత్వంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ మాత్రం ఆలోచించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని స్కూల్ టీచర్లు మండిపడుతున్నారు. ఏప్రిల్‌ లోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జేఈఈ పరీక్షల రీషెడ్యూల్‌ తో తెలంగాణలో ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో మే 11 నుంచి 20వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించాలని బోర్డు భావించింది. జేఈఈ మెయిన్స్ కారణంగా 23 నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ పరీక్షలు జూన్1వ తేదీ వరకు కొనసాగుతాయని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ పరీక్షలు రెండేండ్ల తర్వాత నిర్వహిస్తున్నారని ఆనందపడేలోపే పోస్ట్ పోన్ కావడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైందని యూటీఎఫ్ (టీఎస్), సీపీఎస్ఈయూ, టీఆర్టీఎఫ్, టీపీటీఎఫ్ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం 70 శాతం సిలబస్ కుదించింది.

దీనికి తోడు 11 పేపర్లకు బదులు 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించనుంది. దీనికి అనుగుణంగా జనవరిలోపు సిలబస్ పూర్తి చేసి ఫిబ్రవరి నుంచి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగుస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ లో స్పష్టం చేసినప్పటికీ విద్యా సంవత్సరం ముగిసిన నెలకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో విద్యార్థులకు కష్టంగా ఉంటుందని, అందుకే ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎస్సెస్సీ బోర్డు పునరాలోచించాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed