భోజ్‌శాలలో పూజలు, ప్రార్థనల వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

by Kema Shiva Kumar |

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల పరిసరాల్లో పూజల నిర్వహణపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

భోజ్‌శాలలో పూజలు, ప్రార్థనల వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల పరిసరాల్లో పూజల నిర్వహణపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వసంత పంచమి వేడుకలు, శుక్రవారం నమాజ్ ఒకేరోజు రావడంతో తలెత్తిన ఉత్కంఠకు తెరదించుతూ.. ఇరు వర్గాలకు సమయాన్ని కేటాయిస్తూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భోజ్‌శాల ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు హిందూ సమాజానికి కోర్టు అనుమతినిచ్చింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వసంత పంచమి పూజలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అదేవిధంగా ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించింది.

కాగా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నిబంధనల ప్రకారం.. మంగళవారం హిందువులు, శుక్రవారం ముస్లింలకు భోజ్‌శాల పరిసరాల్లో ప్రార్థనల కోసం అనుమతి ఉంటుంది. అయితే, ఈ ఏడాది వసంత పంచమి శుక్రవారం నాడు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. అదేవిధంగా ప్రార్థనలు, పూజల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని స్థానిక యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story