అవసరమైన వాటికే ఖర్చు చేస్తున్న భారతీయ ప్రజలు: డెలాయిట్ నివేదిక!

by Disha Web Desk 17 |
అవసరమైన వాటికే ఖర్చు చేస్తున్న భారతీయ ప్రజలు: డెలాయిట్ నివేదిక!
X

న్యూఢిల్లీ: భారత్‌లో వినియోగదారులు ఖర్చు చేయడంలో జాగ్రత్త పడుతున్నారని ఓ నివేదిక అభిప్రాయపడింది. అవసరం లేని వస్తువులను కొనడానికి దూరంగా ఉంటున్నారని, వృధాగా ఖర్చు చేసేందుకు వెనకాడుతున్నారని ప్రముఖ కన్స్యూమర్ ట్రాకర్ డెలాయిట్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా దేశంలోని వినియోగదారులు షాపింగ్, వినోదం, వినోద కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. డెలాయిట్ కన్స్యూమర్ ట్రాకర్ సర్వే ప్రకారం.. వినియోగదారులు తమ వ్యాలెట్లలో ఎక్కువ భాగాన్ని వ్యక్తిగత సంరక్షణ, దుస్తులు, వినోదం, సరదా ప్రయాణాలకు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. వీటి తర్వాతే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, రెస్టారెంట్ల వంటి వాటిపై ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రధానంగా సర్వేలో పాల్గొన్న వారిలో తమ ఖర్చులకు సంబంధించి వినోదానికి, అవసరమైన ఖర్చులకు, భవిష్యత్తు అవసరాలకు ఆదా చేయడం వంటి ముఖ్యమైన వాటి పట్ల స్పష్టత కలిగి ఉన్నట్లు వెల్లడించారు. అలాగే, కొవిడ్-19 ముందులాగే కార్యకలాపాలు తెరుచుకోవడం, ప్రయాణ ఆంక్షలు సడలించడంతో కార్పొరేట్ ప్రపంచంలో చాలామంది తిరిగి తమ వ్యాపారాల కోసం ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. నివేదిక ప్రకారం.. దాదాపు 83 శాతం మంది వినియోగదారులు వచ్చే మూడు నెలల్లో వ్యాపారాల కోసం ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే, మెజారిటీ వినియోగదారులు రాబోయే మూడేళ్ల కాలంలో తమ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed