కూకట్‌పల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. తల్వార్‌లతో దాడి..

by Disha Web Desk 19 |
కూకట్‌పల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. తల్వార్‌లతో దాడి..
X

దిశ, కూకట్​పల్లి: వారం రోజు క్రితం జరిగిన స్వల్ప గొడవ చిలికి చిలికి రెండు కుటుంబాలు పరస్పర దాడులకు కారణం అయింది. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్​స్టేషన్​పరిధిలోని రాజీవ్​గాంధీనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి సీఐ నరసింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్​గాంధీనగర్ కాలనీలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తరువాత వీధిలో రెండు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగేటట్లు చేయడం జరిగిందని తెలిపారు. కాగా, రాజీవ్​గాంధీనగర్ కాలనీలో కిరాణం దుకాణం నడుపుతున్న సుల్తాన్‌కు.. అదే కాలనీకి చెందిన మోయిజ్‌తో గత కొంత కాలంగా విబేధాలు ఉన్నాయి. 2010లో జరిగిన ఓ వివాహం విషయంలో రెండు కుటుంబాల మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. గత వారం రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన యువకుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. తాజాగా జరిగిన పరస్పర దాడికి కారణం అయింది. మోయిజ్​శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో సుల్తాన్​అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మోయిజ్, ఫహీమ్‌లపై దాడికి పాల్పడ్డారు.


దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ పెద్దదయ్యింది. ఈ క్రమంలో అక్కడే నిర్మాణంలో ఉన్న ఇంటికి సంబంధించిన కంకర, రాడ్లు, కర్రలతో పాటు తల్వార్‌లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో మోయిజ్​చేయి విరగగా, ఫహీమ్​తలకు బలమైన గాయమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాజీవ్​గాంధీనగర్​కాలనీలో రెండు వర్గాలు దాడులకు పాల్పడుతుండటంతో.. కాలనీ వాసులు భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ నరసింగరావు సిబ్బంది గొడవ పడుతున్న వారిని చెల్లాచెదురు చేశారు. గాయాల పాలైన వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రులలో చేర్పించారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story