విధి నిర్వహణలో మృతి చెందిన లైన్‌మెన్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి భరోసా

by Muthe.Rajitha |

ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ భార్య స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు.

విధి నిర్వహణలో మృతి చెందిన లైన్‌మెన్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ భార్య సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ప్రజాభవన్‌లో అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. శాలరీ ఖాతాలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ. 1 కోటి విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ పథకంలో భాగంగానే ఎన్పీడీసీఎల్ బాసర పరిధిలో లైన్‌మన్‌గా పనిచేస్తున్న ప్రమోద్ కుమార్... సెప్టెంబర్ 23, 2024 నాడు బాసర శాఖలో తన శాలరీ ప్యాకేజీ ఖాతాను ప్రారంభించారు. దురదృష్టవశాత్తు ఆయన మార్చి24, 2025న విధి నిర్వహణలో ఉండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణం తర్వాత, మృతుని నామినీ భార్య స్వప్న క్లెయిమ్ దరఖాస్తును బాసర శాఖలో సమర్పించారు.

ఈ క్రమంలో రూ. 1 కోటి బీమా మొత్తం గత నెల 30న స్వప్న సేవింగ్స్ ఖాతాలో జమ అయింది. ఈ క్లెయిమ్ వేగంగా పరిష్కారం కావడం అనేది ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వానికి, బ్యాంకింగ్ రంగానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఈ సందర్భంగా డిఫ్యూటీ సీఎం పేర్కొన్నారు. శాలరీ ప్యాకేజ్ పథకాల కింద అందిస్తున్న బీమా ప్రయోజనాల ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోందన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, యూనియన్ బ్యాంక్ సీఈవో అశిష్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేష్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, నిజామాబాద్ రీజినల్ హెడ్ అరుణ సవిత, చీఫ్ మేనేజర్ వై.వి రాఘవ, బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story