పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక సన్మానం

by Malleboina Mahesh |

2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉండటం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక సన్మానం
X

దిశ, వెబ్ డెస్క్: 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉండటం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈసారి ఐదుగురికి పద్మ విభూషన్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి ద‌త్తాత్రేయుడుకి ప‌ద్మ భూష‌ణ్‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ రంగం నుంచి గ‌డ్డమ‌ణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాల‌సుబ్రహ్మణ్యన్‌, కుమార‌స్వామి తంగ‌రాజ్, వైద్య రంగంలో గూడూరు వెంక‌ట్ రావు, పాల్కొండ విజ‌యానంద్ రెడ్డి, ప‌శుసంవ‌ర్థ‌క రంగంలో మామిడి రామా రెడ్డి, విద్యా-సాహిత్య రంగాల నుండి మామిడాల జగదీశ్ కుమార్ ఉన్నారు.

అలాగే వెంపటి శశి శేఖర్, వెంపటి కుటుంబ శాస్త్రి, క‌ళా రంగం నుంచి దీపికా రెడ్డి, ముర‌ళీ మోహ‌న్‌, రాజేంద్ర ప్రసాద్‌, గ‌రిమెళ్ల బాల‌కృష్ణ ప్రసాద్‌ల‌కు ప‌ద్మశ్రీ పుర‌స్కారాలు ద‌క్కడం హర్షించదగ్గ విషయం. ఇది తెలుగువారికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడి నుంచే అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత, పద్మ పురస్కార గ్రహీతలందరినీ పిలిచి ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిభావంతులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం రాష్ట్రానికే గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

Next Story