తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నా మానస పుత్రిక : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ పబ్లిక్ స్కూల్ నా మానస పుత్రిక అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నా మానస పుత్రిక : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి, విద్యారంగ బలోపేతానికి అవసరమైన కీలక సూచనలను స్వీకరించింది. ఇందులో భాగంగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మ‌న్ డాక్టర్ ఆకునూరి మురళితో పాటు స సభ్యులు పీఎల్ విశ్వేశ్వ‌ర్ రావు, డాక్ట‌ర్ చార‌కొండ వెంక‌టేష్, జోష్నా శివారెడ్డిల‌ ప్రత్యేక పర్యవేక్షణలో 'ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్' అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా రూపుదిద్దుకుంది.

ఈ పాఠశాలలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, విశాలమైన ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ వంటి కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ స్కూల్ తెలంగాణ విద్యారంగానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. అంతేకాకుండా, క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి ప్రతి క్రీడకు ప్రత్యేక మైదానాలను నిర్మించి, శిక్షణ కోసం ప్రత్యేక కోచ్‌లను కూడా ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ కాన్సెప్ట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం నాలుగు పాఠశాలల్లో ప్రారంభించింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ విధానాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, మొత్తం 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదు స్కూల్ బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది.

కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు భారీగా పోటీ పడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న తమ పిల్లలను సైతం ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎగబడుతుండటంతో, పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక చివరకు 'నో అడ్మిషన్' బోర్డు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్న ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్, రాష్ట్ర విద్యా చరిత్రలోనే ఒక సువర్ణ మైలురాయిగా నిలవనుంది.

Next Story