ఒక్క ఫోన్.. ముగ్గురి ఫ్రెండ్స్ మధ్య చిచ్చు, ఒకరి హత్య

by Disha Web |
ఒక్క ఫోన్.. ముగ్గురి ఫ్రెండ్స్ మధ్య చిచ్చు, ఒకరి హత్య
X

దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సెల్ ఫోన్ తగాదా ముగ్గురు మిత్రుల మధ్య చిచ్చుపెట్టి హత్యకు దారితీసింది. ఈ సంఘటన తాండూరు మండలం అంతారం భూకైలాస్ వాసు నాయక్ తండా - పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. తాండూరు పట్టణానికి చెందిన ప్రశాంత్, మల్ రెడ్డి పల్లికి చెందిన రాజు, అంతారం గ్రామానికి చెందిన జస్వంత్ ముగ్గురు మంచి స్నేహితులు. ప్రశాంత్ అనే మిత్రుడు సెల్ ఫోన్ దొంగలించి తోటి మిత్రులైన జస్వంత్, రాజులకు అప్పజెప్పి అమ్మి వేయాలని చెప్పడంతో ఇరువురు మిత్రులు ఆ ఫోన్‌ను విక్రయించడానికి వెళ్లగా ఈ సెల్ ఫోన్ దొంగ ఫోన్ అంటూ దుకాణ యజమానులు, ఇద్దరు స్నేహితులపై మండిపడ్డారు.

దీంతో దొంగతనం చేసిన సెల్ ఫోన్‌ను తమకు ఇచ్చిన మిత్రుడు ప్రశాంత్ పైన ఆగ్రహం పెంచుకున్నారు. దీంతో వారు మాట్లాడుదామని ప్రశాంత్‌ని పిలిపించి ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో అంతారం భూకైలాస్ వాసు నాయక్ తండా- పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలోకి ప్రశాంత్‌ను తీసుకువెళ్లి బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం నిందితులైన ఇద్దరు మిత్రులు జస్వంత్, రాజు స్థానిక తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. లొంగిపోయిన ఇద్దరు నిందితులను పోలీసులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story