ఇక రంగంలోకి కేసీఆర్.. స్వయంగా ధర్నా చేయనున్న ముఖ్యమంత్రి!

by Disha Web Desk 2 |
ఇక రంగంలోకి కేసీఆర్.. స్వయంగా ధర్నా చేయనున్న ముఖ్యమంత్రి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వడ్ల కొనుగోళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని, తొందర్లోనే తెలంగాణ రైతుల ఆగ్రహాన్ని కేంద్రం చవిచూడక తప్పదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. ఢిలీల్లో స్వయంగా ముఖ్యమంత్రి ధర్నా చేస్తారని, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్ళి ధాన్య సేకరణపై కూలంకషంగా చర్చించిందని, కేంద్రం తన అసమర్ధతను వ్యక్తం చేసిందని, రానున్న రోజుల్లో తెలంగాణ రైతుల సత్తా ఏంటో కేంద్రానికి తెలియజేస్తామన్నారు. ఉగాది పండుగ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రే ఢిల్లీలో ధర్నాకు దిగుతారని, తొందర్లోనే తేదీలను ఖరారు చేస్తామన్నారు. పండగ తర్వాత ఢిల్లీలో ధర్నా గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశం సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఇతర రాష్ట్రాల్లోని రైతాంగ సంఘాలను కూడా కలుపుకుపోవడంపై టీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతాంగ సంఘాలు ఇటీవల తెలంగాణలో పర్యటించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సహా మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్లను కూడా పరిశీలించాయి. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను కూడా సమీక్షించాయి. ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి ఆ రాష్ట్రాల రైతు సంఘాల నుంచి టీఆర్ఎస్ మద్దతు సమీకరించనున్నది.

Next Story

Most Viewed