LPG కొరత ఉంది.. బొగ్గుల పొయ్యి వాడుకోండి : కేంద్ర ప్రభుత్వ సంచలన ప్రకటన

by Muthe.Rajitha |

దేశంలో ఇంధన సంక్షోభం తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బొగ్గుల పొయ్యి వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

LPG కొరత ఉంది.. బొగ్గుల పొయ్యి వాడుకోండి : కేంద్ర ప్రభుత్వ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో LPG కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాల వల్ల దేశీయంగా సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని వెల్లడించింది. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్లిష్ట సమయంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 6,000 ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు మెరుపు దాడులు నిర్వహించాయి. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 1,000కి పైగా చోట్ల సోదాలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఇక బొగ్గుల పోయ్యే దిక్కు

ప్రస్తుత గ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించి, వీలైనంత వరకు PNG కనెక్షన్లను తీసుకోవాలని కోరింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో కిరోసిన్ మరియు బొగ్గు పొయ్యిలను కూడా వినియోగించుకోవాలని సూచించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. విద్యుత్, వంట అవసరాల కోసం బొగ్గు కొరత రాకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలకు తగినంత బొగ్గు నిల్వలను సరఫరా చేయాలని సింగరేణి కాలరీస్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. యుద్ధం వల్ల ఏర్పడిన ఈ తాత్కాలిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రజలు సహకరించాలని, అనవసరంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Next Story