ఫ్లాష్.. ఫ్లాష్.. జమిలి ఎన్నికలపై కేంద్రం సంచలన ప్రకటన

by Disha Web Desk 4 |
ఫ్లాష్.. ఫ్లాష్.. జమిలి ఎన్నికలపై కేంద్రం సంచలన ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిధిలో ఉన్నదని, ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలన్న అంశం మీద సమాలోచనలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ అంశంపై చర్చించి కొన్ని సిఫారసులు చేసిందని గుర్తు చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందని, లా కమిషన్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా స్పష్టత వస్తుందని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రెజిజు లోక్‌సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నందున సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతున్నదని, పరిపాలనా సంబంధమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉన్నదని, అసెంబ్లీ ఎన్నికల ఖర్చును రాష్ట్రాలు భరిస్తున్నాయని వివరించారు. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చొప్పున భరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒక్కో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రూపొందించే ఎన్నికల షెడ్యూలుకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కనిష్టంగా 37 రోజుల నుంచి గరిష్ఠంగా 80 రోజుల సమయం పడుతున్నదని వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలను నిర్వహించడంపై గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లోతుగా అధ్యయనం చేసి ఎంపీలతో చర్చలు జరిపి కొన్ని సూచనలు, సిఫారసులు చేసిందని, అనేక ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే వాటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. మరింత సంప్రదింపుల ప్రక్రియ కోసం ఎన్నికల కమిషన్‌కు, లా కమిషన్‌కు పంపినట్లు తెలిపారు.

స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులు, రూపొందించిన నివేదికను లా కమిషన్ అధ్యయనం చేస్తున్నదని, త్వరలోనే ప్రణాళిక రూపొందించనున్నదని, ప్రస్తుతం ఆ పనిలోనే కమిషన్ నిమగ్నమైందని స్పష్టం చేశారు. తరచూ ఎన్నికలు జరుగుతున్నందున ఎలక్షన్ కోడ్‌తో ప్రజలకు అందాల్సిన నిత్యావసర సేవలు, పరిపాలనా సంబంధమైన అంశాలకు విఘాతం కలుగుతున్నదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్న కారణంగా భారీ స్థాయిలో ప్రజాధనం ఖర్చవుతుందని, ఒకేసారి కలిపి జరిగితే తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలకపై వివిధ పార్టీలతో ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిషన్ సంప్రదింపులు జరిపి అభిప్రాయాలను సేకరించిందని గుర్తుచేశారు.

Next Story

Most Viewed