వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం.. భారీగా పెంచిన హరిత పన్ను

by Disha Web Desk 2 |
వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం.. భారీగా పెంచిన హరిత పన్ను
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలం చెల్లిన వాహనాలతో దర్జాగా రోడ్డెక్కుతున్న వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. ఇలాంటి వాహనాలను అరికట్టి పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 15 ఏళ్లు దాటిన వాహనాల వినియోగాన్ని కొనసాగించే పన్నును కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారీగా పెంచింది. హరిత పన్నును పెంచడం ద్వారా కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ హరితపన్నును చెల్లిస్తే మరో ఐదేళ్లపాటు వాహనాన్ని రోడ్డెక్కించే అవకాశం కల్పించింది. కానీ, ఇకపై ప్రతి వాహనానికి కాలుష్య పరీక్ష నిర్వహించాలని కేంద్ర యోచిస్తోంది. తద్వారా కాలుష్యం అధికంగా కలిగించే వాహనాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణలో మొత్తం 1.45 కోట్ల వాహనాలు ఉండగా.. అందులో కాలం చెల్లిన(15ఏళ్లు నిండిన) వాహనాలు దాదాపు 32 లక్షలు ఉన్నాయి. కానీ, 1.75 నుంచి 1.95 లక్షల వాహనాలు మాత్రమే హరిత పన్ను చెల్లించనట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి హరిత పన్ను చెల్లించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం పెంచిన హరిత పన్ను వివరాలు ఇలా ఉన్నాయి. ద్విచక్రవాహనానికి గతంలో రూ.300 ఉండగా.. ఇకపై రూ.1000 వసూలు చేయనున్నారు. కారుకు రూ.600 ఉండగా.. రూ.5000 చెల్లించాలి. విదేశీ వాహనాలు రూ.15000 ఉంటే.. ఇప్పుడు రూ.40000 చెల్లించి రిన్యూవల్ చేసుకోవాలి. దీనితోపాటు ఫిట్ నెస్ ఛార్జీలు కూడా కేంద్రం పెంచింది. ట్యాక్సీకి రూ.1000 ఉండగా.. తాజాగా రూ.7000 చెల్లించాల్సి వస్తుంది. బస్సు/లారీలకు రూ.1500 ఉంటే ఇప్పుడు రూ.12,500 చెల్లించాల్సిందే.

Next Story

Most Viewed