- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
200 మీటర్ల లోయలో పడి తగలబడిన కారు.. ఇద్దరు సజీవ దహనం!
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. 200 మీటర్ల లోయలో కారు పడిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనమయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లాలో జరిగింది. బారాకోట్ పరిధిలోని బాప్రూ-బంటోలి రహదారి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక టాటా పంచ్ (Tata Punch) వాహనం అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. లోయలో పడిపోయిన వెంటనే వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుంది. మధ్యాహ్నం 1:07 గంటల సమయంలో ఈ సమాచారం అందుకున్న చంపావత్ ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందం, సబ్ ఇన్స్పెక్టర్ దుంగర్ సింగ్ నాయకత్వంలో అవసరమైన సహాయక సామాగ్రితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది.
లోతైన లోయ, అటవీ ప్రాంతం కావడంతో ఎస్డీఆర్ఎఫ్, స్థానిక జిల్లా పోలీసులు అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మంటల మధ్య చిక్కుకున్న వారిలో నీతూ దేవి (31), అక్షిత (8), ఆరవ్ (5) అనే ముగ్గురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా వెలికితీసి, అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజేంద్ర కుమార్ (47), బలదేవ్ కుమార్ (34) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతులిద్దరూ దిదిహట్ పరిధిలోని అంజేడ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారి మృతదేహాలను లోయ నుంచి వెలికితీసి, తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం జిల్లా పోలీసులకు అప్పగించారు.






