రేవంత్ రెడ్డి ఓ బుడ్డర్‌ఖాన్.. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి..: మంత్రి ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 12 |
రేవంత్ రెడ్డి ఓ బుడ్డర్‌ఖాన్.. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి..: మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

దిశ, కామారెడ్డి రూరల్ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ బుడ్డర్ ఖాన్ అని, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్ లో నిర్వహించిన రైతు దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తో రైతుల ధాన్యం కొనుగోలు చేయించలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ లు రాజీనామా చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలే ఇప్పటి దాకా రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని సేకరించాయని, గత సంవత్సరం వరకు కూడా మోడీ ప్రభుత్వం ధాన్యం సేకరించిందన్నారు.

ఈ సంవత్సరం వేసవి కాలంలో పండిన ధాన్యాన్ని కోరబోమని కేంద్రం మొండి చేస్తుందన్నారు. మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన సమయంలో వరి పండించవద్దని చెప్పినా ఎందుకు పండించారని మంత్రి పీయూష్ గోయల్ ప్రశ్నిస్తే.. మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రంతో ధాన్యం కొనిపించే బాధ్యత నాది అని, వరి వేయాలంటూ.. రైతులకు హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రికి వీడియో క్లిప్పింగులతో సహా చూయించడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో ఎండాకాలంలో వచ్చే ధాన్యంతో నూకలు బాగా వస్తాయని, తాము కొనేది లేదని అవమానకరంగా మాట్లాడారని గుర్తుచేశారు. రూ.10 వేల కోట్లు తనకు ఇస్తే ధాన్యం కొనిపిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని, అదే రూ. పదివేల కోట్లు మా పీఏసీఎస్ చైర్మన్‌లకు ఇస్తే కొంటారాని, కానీ ధాన్యం కొనే బాధ్యత కేంద్రానిదే కాబట్టి అడుగుతున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి, బీజేపీ ఒక్కటేనని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం మీద తప్ప కేంద్రంలోని బీజేపీ పై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు.

అందుకే శుక్రవారం ప్రతి రైతు ఇంటి పై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలపాలని కోరారు. ఈ నెల 11న ఢిల్లీ వెళ్లి అక్కడ దీక్ష చేస్తామని చెప్పారు. ఇప్పుడు వదిలిపెడితే ప్రతి యాసంగి సమయంలో ఇదే విధంగా చేస్తారని, కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనేలా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జడ్పీ చైర్మన్ దఫెదర్ శోభ, వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story