ఆరుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన బిజూ జనతా దళ్‌

by Malleboina Mahesh |

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నిర్ణయం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం!

ఆరుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన బిజూ జనతా దళ్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేడీ (BJD) పార్టీల్లో పెను ప్రకంపణలు సృష్టించాయి. ఎవరూ ఊహించని విధంగా ఒడిశాలో క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ, స్వాతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఈ రోజు బిజూ జనతా దళ్ (BJD) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha Elections) పార్టీ విప్‌ను ధిక్కరించి 'క్రాస్ ఓటింగ్‌'కు పాల్పడటం, పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడమే ఈ కఠిన చర్యకు ప్రధాన కారణమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు

చక్రమణి కన్హర్ (బాలిగూడ నియోజకవర్గం)

నబ కిశోర్ మల్లిక్ (జయదేవ్ నియోజకవర్గం)

సౌవిక్ బిస్వాల్ (చౌద్వార్-కటక్ నియోజకవర్గం)

సుభాసిని జెనా (బస్తా నియోజకవర్గం)

రమాకాంత భోయ్ (తిర్టోల్ నియోజకవర్గం)

దేవీ రంజన్ త్రిపాఠి (బంకీ నియోజకవర్గం)

సస్పెన్షన్ వేటుకు కారణాలు

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింట్, పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు పార్టీ చీఫ్ జారీ చేసిన 'షోకాజ్' నోటీసులకు సదరు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలను బీజేడీ క్రమశిక్షణ కమిటీ లోతుగా పరిశీలించింది. అనంతరం రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) తీసుకున్న నిర్ణయం మేరకు వీరిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ ఉమ్మడి నిర్ణయాలకు లోబడి ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని వీరు ఉల్లంఘించారని, పార్టీ పట్ల విధేయత పాటించడంలో విఫలమయ్యారని లేఖలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఒడిశా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Next Story