పట్టారాదు.. పరిహారం లేదు.. మేమేం చేయాలి?

by Disha Web Desk 13 |
పట్టారాదు.. పరిహారం లేదు.. మేమేం చేయాలి?
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెం కి చెందిన భాగోతుల కనకయ్యకు ఒక ఎకరం 20 కుంటల భూమి ఉంది. అందులో తను వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన వ్యవసాయ భూమిని 1982లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టాదార్ పాస్ పుస్తకం కోసం ఐదు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఏళ్ల తరబడి తిరిగినా పాస్ పుస్తకం రాకపోవడంతో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించి, ఈ భూమి కనకయ్యదిగా నివేదిక అందజేశారు. ఇక పట్టా వస్తుందని ఎదురు చూసే క్రమంలో కనకయ్య మరణించాడు. అనంతరం తన వారసుడైన భాగోతుల రమేష్ తాజాగా మరోసారి పట్టాదార్ పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నాడు. రమేష్ దరఖాస్తు స్వీకరించిన రెవెన్యూ సిబ్బంది భూ రికార్డులు తనిఖీ చేసి అతనికి ఊహించని షాక్ ఇచ్చారు. తాను ప్రస్తుతం సాగుచేస్తున్న సర్వే నెంబర్ 72 లో ఉన్న ఒక ఎకరం 20 గుంటల భూమి ప్రభుత్వానికి చెందిందని నిర్ధారించి వెళ్ళిపోయారు. 1982లో తన తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన భూమి ప్రభుత్వ స్థలం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నాడు.

అసలు దీని వెనుక ఏం జరిగింది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం రైతుల వద్ద నుండి సుమారు 30 ఎకరాల తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల చుట్టూ భారీ ప్రహరీ నిర్మించింది. కానీ బాధితుడు రమేష్ సాగుభూమి నిర్మాణానికి అవసరం పడలేదు. అదే సర్వే నెంబర్ 72 లో ఉన్న భూములను గవర్నమెంట్ భూములుగా గుర్తించిన రెవెన్యూ సిబ్బంది మా భూమి కూడా అందులో కలపడంతో తమకు పట్టాదారు పాస్ పుస్తకం రావడంలేదని బాధితుడు వాపోతున్నాడు. ఒకవేళ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం తన భూమిని తీసుకున్నట్లయితే వారికి పరిహారం ఎందుకు అందలేదని, తమ సాగుభూమికి ఆనుకొని ఉన్న 72 సర్వేనెంబర్ లో గల నాలుగు ఎకరాల భూమికి పాసుపుస్తకం ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పిదాలకు తాము నష్టపోతున్నామని, తక్షణమే అధికారులు ఖచ్చితమైన సర్వే నిర్వహించి తమకు పట్టాదారు పాస్ పుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.



Next Story

Most Viewed