రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో మెజిస్ట్రేట్ రాజీనామా.. క్రమశిక్షణా చర్యలకు సర్కార్ ఆదేశం

by Malleboina Mahesh |

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బరేలీ సిటీ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి సోమవారం తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో మెజిస్ట్రేట్ రాజీనామా.. క్రమశిక్షణా చర్యలకు సర్కార్ ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బరేలీ సిటీ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి (Magistrate Alankar Agnihotri) సోమవారం తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా కొత్త యూజీసీ (UGC) నిబంధనలు, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఆయన రాజీనామా చేసిన మరుసటి రోజే యూపీ ప్రభుత్వం (UP Govt) ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అలంకార్ అగ్నిహోత్రిని షామ్లీ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ అలంకార్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కొంతకాలంగా బ్రాహ్మణ వ్యతిరేక ధోరణి కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. జైల్లో ఒక బ్రాహ్మణ వ్యక్తిని డిప్యూటీ జైలర్ కొట్టి చంపడం, అలాగే శ్రీ అవిముక్తేశ్వరానంద జీ మహరాజ్ శిష్యులపై జరిగిన దాడులు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు. వీటితో పాటు 2026 కొత్త యూజీసీ నిబంధనలు కూడా తన నిర్ణయానికి ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు.

వార్తా విభాగం నిబంధనల ప్రకారం.. ఆయనపై శాఖాపరమైన విచారణకు రంగం సిద్ధమైంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రాజీనామా ప్రకటన చేయడం, ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో షామ్లీ కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా అగ్నిహోత్రిని ఆదేశించింది. ఒక సిట్టింగ్ మెజిస్ట్రేట్ నేరుగా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Next Story