ఎంఎస్ఎంఈలకు 'ముత్యాల ముగ్గు' అవార్డులు

by Disha Web Desk 12 |
ఎంఎస్ఎంఈలకు ముత్యాల ముగ్గు అవార్డులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎంఎస్‌ఎంఈలో ఉత్పాదకత, సృజనాత్మకత, భద్రతకు సంబంధించిన కృషిని గుర్తించి రాష్ట్ర స్థాయి, జిల్లాల్లో అవార్డులు ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఇందుకు 'తెలంగాణ ముత్యాలు' పేరిట ఈ అవార్డులను అందజేయనుంది. ఇందు కోసం 2022-23 వార్షిక బడ్జెట్‌లో రూ.50లక్షలు కేటాయించింది.

ఎంఎస్‌ఎంఈ ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు వ్యవస్తాపకులు యూనిట్లను త్వరగా ఏర్పాటు చేసేందుకు ప్రధాన పారిశ్రామిక వాడల్లో మౌళిక వసతుల కల్పనను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంఎస్‌ఎంఈ ల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలతో పాటు అవార్డులు ఇచ్చి మరింత ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే చిన్న, లఘు పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన క్లస్టర్లను పరిశ్రమల శాఖ అభివృద్ధి చేస్తుంది.

ఈ క్లస్టర్లలో ఉమ్మడి సదుపాయాల కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉత్పాదకత, నాణ్యత మెరుగు పరుచుకోవంతోపాటు ముడి సరుకు కొనుగోలు, మార్కెటింగ్‌లో సంప్రదింపులు బలోపేతం చేసుకునే వెసులుబాటు చిన్న, లఘు పరిశ్రమల యాజమాన్యాలకు లభిస్తుంది. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూత పడకుండా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభించింది. కరోనా సమయంలో మూతపడకుండా రుణాలను సైతం అందజేసింది.

కేంద్రం ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక క్లస్టర్లకు ఆర్థికసాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటాగా పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో 12 క్లస్టర్లు పురోగతిలో ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 19 జిల్లాల్లో ఇండస్ట్రియల్‌ క్లస్టర్లను అభివృద్ది చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో క్లస్టర్‌ ఏర్పాటుకు రూ.10 కోట్లు చొప్పున అవసరమవుతాయని అంచనా వేయగా, ఇందులో కేంద్రం వాటా రూ.8 కోట్లు, రాష్ట్రం వాటా రూ.2 కోట్లు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇండస్ట్రియల్‌ క్లస్టర్ల ఏర్పాటుకు రూ.38 కోట్లు ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం.

పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నా పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులు లేక యూనిట్ల స్థాపన ఆలస్యమవుతుండటంతో పెట్టుబడిదారుల పై అదనపు భారం పడుతోంది. ప్రధాన పారిశ్రామిక వాడల్లో ప్లగ్‌ అండ్‌ ప్ల సౌకర్యాలను అభివృద్ది చేయడం ద్వారా పెట్టుబడిదారులు తమ యూనిట్లను త్వరగా ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది. ఇదిలా ఉండగా పారిశ్రామిక వాడల్లో మౌళిక వసతుల కల్పనకు కేంద్రం ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లె‌క్స్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఒక్కో పారిశ్రామిక వాడ కు కేంద్రం వాటాగా రూ.12 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పథకంతో రాష్ట్రంలో 27 పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Next Story

Most Viewed