కాళేశ్వరం జలాలు మరో పది రోజులు పెంపు.. ఎల్ఎండి అధికారుల ప్రకటన

by Disha Web |
కాళేశ్వరం జలాలు మరో పది రోజులు పెంపు.. ఎల్ఎండి అధికారుల ప్రకటన
X

దిశ,తుంగతుర్తి: శ్రీరాంసాగర్ రెండవదశ (ఎస్ఆర్ఎస్పి) కాలువల ద్వారా సూర్యాపేట జిల్లా వైపు వస్తున్న కాళేశ్వరం జలాలను మరో పది రోజులు పెంచుతూ కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండి) ఉన్నతాధికారులు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సమాచారాన్ని సూర్యాపేట జిల్లాలో ఉన్న ఎస్ఆర్ఎస్పి శాఖ అధికారులకు ప్రకటన రూపంలో పంపారు. గత ఏడాది డిసెంబర్ 27న ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్న బయన్న వాగు రిజర్వాయర్ ద్వారా వారబందీ (వారం విడిచి వారం) పద్ధతిలో సూర్యాపేట జిల్లా వైపు నీటిని విడుదల జరిగింది. ఆనాడు ఏప్రిల్ 10 వరకే నీటి విడుదలకు చివరి ఈ రోజుగా ప్రకటించి అనంతరం పూర్తిస్థాయిలో నీటిని నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే మరో పది రోజులు నీటి విడుదల చేయాలని కోరుతూ జిల్లా ఎస్ఆర్ఎస్పి అధికారులు కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి అధికారులకు ఒక లేఖ రాశారు.

అంతేకాకుండా 12 టిఎంసిల నీరు సూర్యాపేట జిల్లాకు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 9.3 టీఎంసీల నీటినే వదిలారని వారు లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా నుండి నీరు విడుదలయ్యే క్రమంలో మధ్య మధ్యన ఏర్పడిన పలు అవంతరాలను కారణాలుగా చూపిస్తూ పదిహేను రోజులపాటు నీటి సరఫరాను నిలుపుదల చేశారని తద్వారా తమ జిల్లాకు రావాల్సిన నీటి వాటా రాలేదని వారు లేఖలో వివరించారు. ముఖ్యంగా వరి పంట చేతికి రావడానికి మరి కొంత సమయం పడుతున్న దృష్ట్యా మధ్యలో నీటి సరఫరా బంద్ చేస్తే రైతాంగం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు వివరించారు.

ఈ మేరకు వీటిపై సుదీర్ఘ స్థాయిలో చర్చలు జరిపిన ఎల్ఎండి అధికారులు ఈనెల 20 వరకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఎల్ఎండి నుండి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే మధ్యలో ఉన్న మైలారం రిజర్వాయర్ లోకి (ఉమ్మడి వరంగల్ జిల్లా మైలారం గ్రామం వద్ద) 4 వేల క్యూసెక్కుల నీరు చేరి నిలువ ఉంటుందని, మిగతా రెండు వేల క్యూసెక్కుల నీరు బయన్న వాగు రిజర్వాయర్లోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా వైపు 69,70,71 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మరో పది రోజుల పాటు 19 వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని డి.ఈ సత్యనారాయణ ఆదివారం రాత్రి "దిశ"తో మాట్లాడుతూ వివరించారు. రైతులు మరో పది రోజుల పాటు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed