భారత్‌పే సీఈఓపై చర్యలు తీసుకోవాలి: అష్నీర్ గ్రోవర్

by Disha Web Desk 17 |
భారత్‌పే సీఈఓపై చర్యలు తీసుకోవాలి: అష్నీర్ గ్రోవర్
X

న్యూఢిల్లీ: భారత్‌పే మాజీ ఫౌండర్‌ అష్నీర్ గ్రోవర్‌ ప్రస్తుత సీఈఓ సుహైల్ సమీర్‌పై చర్యలు తీసుకోవాలని కంపెనీ బోర్డుకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో సుహైల్ సమీర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని, అలాగే, భారత్‌పే ఛైర్మన్‌గా రజనీష్ కుమార్ కూడా రాజీనామా చేయాలని కోరారు. భారత్‌పే మాజీ ఉద్యోగి కరణ్ సర్కి సోషల్ మీడియా పోస్ట్‌లో అష్నీర్ గ్రోవర్ సోదరి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన సుహైల్ సమీర్.. 'మీ సోదరుడు కంపెనీ మొత్తం సొమ్మును దొంగలించాడు, ఇప్పుడు జీతాలు చెల్లించడానికి డబ్బు సరిపోవడంలేదంటూ' వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో అష్నీర్ గ్రోవర్ సీఈఓ తన నీచమైన బహిరంగ ప్రవర్తనకు తక్షణమే షోకాజ్ నోటీసులు అందజేయాలి. కంపెనీ బ్రాండ్‌ను చెడగొట్టే పద్దతిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సమయంలో మద్యం, డ్రగ్స్ మత్తులో లేడని బోర్డుకు ఖచ్చితంగా నిరూపించాలన్నారు. సుహైల్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను స్వతంత్ర ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయాలని, ఆ నివేదికను బోర్డుకు సమర్పించిన తర్వాత మాత్రమే సీఈఓగా తిరిగి నియమించబడాలన్నారు. కాగా, అంతకుముందు కంపెనీ ఈ ఏడాదికి సంబంధించిన మొదటి త్రైమాసిక ఫలితాలను అష్నీర్ గ్రోవర్ ట్విటర్‌లో వ్యంగ్యంగా స్పందించారు. భారత్‌పే తొలి త్రైమాసికంలో ఫలితాలు రజనీష్ కుమార్, సుహైల్ సమీర్ లాంటి అసమర్థ లీడర్‌షిప్‌లో సంస్థ ఫలితాలు దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.


Next Story