థాయ్‌లాండ్‌లో మరో ఘోర క్రేన్ ప్రమాదం

by Muthe.Rajitha |

థాయ్‌లాండ్‌లో మరో ఘోర క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావడం సంచలనం రేపింది.

థాయ్‌లాండ్‌లో మరో ఘోర క్రేన్ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : థాయ్‌లాండ్‌లో మరో ఘోర క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావడం సంచలనం రేపింది. కాగా నేడు బ్యాంకాక్ సమీపంలోని సముత్ సాఖోన్ ప్రావిన్స్‌లో రామా–II ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న క్రేన్ ఒక్కసారిగా కూలిపోయి రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎలివేటెడ్ హైవే నిర్మాణంలో భాగంగా ఉపయోగిస్తున్న ఈ క్రేన్ ఇటాలియన్–థాయ్ డెవలప్‌మెంట్ కంపెనీకి చెందినదిగా అధికారులు తెలిపారు.

కాగా ఇదే కంపెనీకి చెందిన క్రేన్ నిన్న నఖోన్ రాచసిమాలో రైలు మీద పడటంతో 32 మంది మరణించి, 66 మంది గాయపడిన విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజుల్లో, అదే కంపెనీకి చెందిన క్రేన్‌ల వల్ల భారీ ప్రాణనష్టం జరగడంతో థాయ్‌లాండ్‌లో నిర్మాణ భద్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రహదారిని ప్రజలు ఇప్పటికే “డెత్ రోడ్” అని పిలుస్తుండగా, గతంలోనూ ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి.

ఈ ఘటనలపై థాయ్ ప్రధాని అనుటిన్ చార్న్‌విరాకుల్ స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటాలియన్–థాయ్ డెవలప్‌మెంట్ కంపెనీకి సంబంధించిన అన్ని నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు ప్రమాదాలపై విచారణ కొనసాగుతుండగా.. బాధితుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని కంపెనీ అధికారులు ప్రకటించారు.

Next Story