మానవత్వం చాటుకున్న అదనపు కలెక్టర్

by Web Desk |
మానవత్వం చాటుకున్న అదనపు కలెక్టర్
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: కారుంటే చాలు.. రోడ్డు పక్కన ఏం జరుగుతుందో కూడా చూడకుండా ప్రయాణించే రోజులివి. అందులో ఉద్యోగులైతే రోడ్డు పక్కన ప్రమాదం జరిగితే అక్కడ ఏమి జరగనట్టుగా వ్యవహరిస్తారు. అలాంటిది జిల్లా అదనపు కలెక్టర్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఎంత బిజీ‌గా ఉన్న... పక్కన ఆపద ఉందని తెలిస్తే చాలు... తన పని మర్చిపోయి వారికి సహాయ సహకారాలు చేస్తారు. తాజాగా వృద్ధులు, వికలాంగులు, పిల్లల పట్ల ఎప్పుడు.. ఆప్యాయత, గౌరవ భావంతో మెలుగుతూ ఉండే జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. శనివారం సాయంత్రం తన వాహనంలో వెళుతుండగా గౌరారం వద్ద 54 సంవత్సరాల మతిస్థిమితం సరిగా లేని వృద్ధురాలు ఈశ కంటి పోచమ్మ రాజీవ్ రహదారి ప్రధాన రోడ్డు పై అడ్డదిడ్డంగా సంచరిస్తూ కనిపించింది. రహదారిపై వేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో.. వాహనాల వల్ల వృద్ధ మహిళ‌కు ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించిన జిల్లా అదనపు కలెక్టర్ తన వాహనాన్ని అపారు.

వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. వృద్ధురాలి చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ వస్తుందా? ఇల్లు ఉందా అంటూ కుశల ప్రశ్నలు అడిగారు. పెన్షన్ వస్తున్నట్లు వృద్ధురాలు తెలిపింది. అతికష్టం మీద వృద్ధురాలి చిరునామా తెలుసుకున్న అదనపు కలెక్టర్.. ఆమెను తన వాహనంలో తీసుకెళ్ళి వృద్ధురాలి స్వగ్రామం మర్కుక్ మండల కేంద్రములో సురక్షితంగా దించారు. దించే సమయంలో తన భుజాల పై వృద్ధురాలిని స్వయంగా అదనపు కలెక్టర్ మోసుకెళ్లి.. గ్రామపంచాయతీ వద్దకు చేర్చారు. గ్రామ సర్పంచ్ భాస్కర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ శాంతి, వృద్ధురాలి అన్నయ్య సాయిలు, బాలయ్య లకు వృద్ధురాలిని అప్పగించారు. మతిస్థిమితం సరిగా లేని వృద్ధురాలి సంరక్షణ బాధ్యత కుటుంబ సభ్యుల దేనని తెలిపారు. వృద్ధురాలిని బాగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు అదనపు కలెక్టర్ హితబోధ చేశారు. ఇకముందు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.


Next Story

Most Viewed