ఓటు హక్కు కల్పించాలని కోర్టు ఎదుట ఆందోళన..

by Dishafeatures2 |
ఓటు హక్కు కల్పించాలని కోర్టు ఎదుట ఆందోళన..
X

దిశ, బెల్లంపల్లి : ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓ అడ్వకేట్ కోర్టు గేటు ముందు ఆందోళనకు దిగిన ఘటన శనివారం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో గోలి శ్రీనివాస్ గత ఏడు సంవత్సరాల నుండి అడ్వకేట్‌గా పని చేస్తున్నారు. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తనకు ఓటు హక్కును లేకుండా చేశారని ఆరోపిస్తూ కోర్టు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి పక్కన శ్రీనివాస్ బైఠాయించారు. ప్రస్తుతం జరగనున్న బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తనకు ఓటు హక్కు లేకుండా చేయడంపై ఆయన మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును రద్దు చేసే హక్కు బార్ అసోసియేషన్ కు లేదని అన్నారు. నాకు ఓటు హక్కు పునరుద్ధరించే వరకు ఆందోళన ఆగదని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

నో డ్యూస్ సర్టిఫికెట్ లేదు : బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా.. ఓటు వేయాలనుకున్నా.. ఆ సభ్యుడు నో డ్యూస్ సర్టిఫికెట్ అందజేసి ఓటు హక్కును పొందాల్సి ఉంటుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. గోలి శ్రీనివాస్ గత ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరించాడని తెలిపారు. ఈ క్రమంలో నామినేషన్ వేసే సభ్యులు చెల్లించిన రుసుము సుమారు రూ. 23 వేలకు పైగా బార్ అసోసియేషన్‌కు చెల్లించకుండా దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ డబ్బుల విషయంలో లెక్కలు చెప్పకపోవడంతో శ్రీనివాస్‌కు నో డ్యూ స్ సర్టిఫికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు.


Next Story

Most Viewed