రేపే యూపీలో చివరి దశ పోలింగ్.. 9 జిల్లాల్లో 54 స్థానాలకు పోలింగ్

by Disha Web |
రేపే యూపీలో చివరి దశ పోలింగ్.. 9 జిల్లాల్లో 54 స్థానాలకు పోలింగ్
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం 9 జిల్లాల్లోని 54 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 54 స్థానాల్లో 613 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్లు అధికారులు చెప్పారు. దాదాపు 2.04కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించినట్లు చెప్పారు. ఈ సారి పోలింగ్‌లో అందరి చూపు మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైనా వారణాసిపై ఉంది. పలు పార్టీల నేతలు కూడా వారణాసిలో ప్రచారం ఉధృతంగా చేశారు. అంతేకాకుండా బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన దారా సింగ్ చౌహన్, యూపీ మంత్రులు నీల్ కాంత్ తివారీ, అనిల్ రాజ్ భర్, రవీంద్ర జైస్వాల్, గిరీష్ యాదవ్, రామశంకర్ సింగ్ పటేల్ వంటి నాయకులు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటగా ఈ ప్రాంతాలు 2017లో మోడీ ప్రభంజనంతో బీజేపీ 29 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఎస్పీ 11, బీఎస్పీ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తం 403 స్థానాలకు‌గానూ ఆరు దశల్లో 349 స్థానాల్లో పోలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది.


Next Story

Most Viewed