110 రోజుల్లో 6000 కిలోమీటర్లు.. ఢిల్లీ యువతి గిన్నిస్ రికార్డ్

by Javid Pasha |
110 రోజుల్లో 6000 కిలోమీటర్లు.. ఢిల్లీ యువతి గిన్నిస్ రికార్డ్
X

దిశ, ఫీచర్స్ : ఇండియన్ అల్ట్రా రన్నర్ సుఫియా ఖాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అతి తక్కువ సమయంలో 'గోల్డెన్ క్వాడ్రిలేటరల్' (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాలను కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ నెట్‌వర్క్) పై పరుగును పూర్తిచేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఢిల్లీకి చెందిన ఈ అల్ట్రా రన్నర్ కేవలం 110 రోజుల 23 గంటల 24 నిమిషాల్లో 6,002 కిలోమీటర్ల దూరం ప్రయాణించగా.. అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేసిన మహిళగా రికార్డుకెక్కింది.

సుఫియా డిసెంబర్ 16, 2020న దేశ రాజధాని ఢిల్లీ నుంచి తన పరుగును ప్రారంభించింది. ఏప్రిల్ 6, 2021 నాటికి ఆమె 'గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సర్క్యూట్‌'ను పూర్తి చేసింది. అయితే ఈ ఆదివారం గిన్నిస్ సర్టిఫికెట్ అందుకున్న తర్వాత ఈ రికార్డు ధృవీకరించబడింది. 2017లో తన లైఫ్‌లో మొదటి మారథాన్‌లో పాల్గొన్న ఖాన్.. రెండేళ్ల తర్వాత ఈ అల్ట్రా-డిస్టెన్స్ రన్నింగ్‌ను ప్రారంభించి, విజయవంతంగా కంప్లీట్ చేసింది. ఈ రన్నింగ్ టైమ్‌‌లో చాలా గాయాలు అయినప్పటికీ, షార్ట్ టైమ్‌లో పరుగు పూర్తి చేయడంపైనే ఫోకస్ చేసినట్లు సుఫియా వెల్లడించింది.

ఇక సుఫియా భర్త సపోర్ట్ కారు నడుపుతూ ఆమె లక్ష్యానికి మద్దతుగా నిలిచాడు. పోషకాహారం, ఫిజియోథెరపీతో పాటు సుఫియా షెడ్యూల్స్‌ను కూడా అతనే చూసుకున్నాడు. కాగా ఈ ప్రయాణంలో స్థానిక రన్నర్లు, సైక్లిస్టులు కూడా వివిధ ప్రాంతాల్లో ఆమెతో చేరారు. నగరాలు, చిన్న-పట్టణాల ప్రజలు తమ ఇంట్లో రాత్రి బసతో పాటు డిన్నర్‌కు తనకు ఆతిథ్యమిచ్చినట్లు సుఫియా తెలిపింది. ఈ క్రమంలో కొన్ని రాత్రులు రోడ్డు పక్కన షెల్టర్లలో కూడా పడుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఇదేకాక గతంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా పరిగెత్తిన మహిళగా ఆమె ఇప్పటికే గిన్నిస్‌ రికార్డ్ సృష్టించింది.



Next Story

Most Viewed