ఆ ఉద్యోగులకు వరంలా మారిన 317 జీవో.. జోరుగా బేరసారాలు?

by Disha Web Desk 2 |
ఆ ఉద్యోగులకు వరంలా మారిన 317 జీవో.. జోరుగా బేరసారాలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 317 జీవో కొందరికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటే మరికొందరికి వరంగా మారింది. ఇటీవల ప్రభుత్వం పరస్పర బదిలీలకు అనుమతులిచ్చింది. అప్పటి నుంచి నచ్చిన ప్రాంతానికి వెళ్లేందుకు ఉద్యోగుల మధ్య బేరసారాలు జోరుగా జరుగుతున్నాయి. రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉండాలని కోరుకోవడమే ఇందుకు కారణమవుతోంది. రూరల్ ఏరియాల నుంచి సిటీకి వెళ్లేందుకు ఎంత చెల్లించేందుకైనా పలువురు టీచర్లు సిద్ధమయ్యారు. పట్టణ ప్రాంతాలకు పరిసర జిల్లాల్లో అయితే హెచ్‌ఆర్‌ఏ 24 శాతం వస్తుందని, మారుమూల జిల్లాల్లో 11 శాతం వస్తుండటం కూడా పరస్పర బదిలీల్లో ముడుపులిచ్చేందుకు ఒక కారణమైంది.

కాగా, పరస్పర బదిలీల్లో భాగంగా ఇలాంటి డీలింగ్స్​కుదుర్చుకున్న వారిలో ఎక్కువశాతం సీనియర్లే ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్లు ఎంత చెల్లించైనా తమకు నచ్చిన స్థానాలకు వెళ్తుండటం సీనియర్లకు కలిసొస్తుంది. ఈ వేసవి పూర్తయ్యాక ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పీజీహెచ్ఎం స్థాయి ఉన్నోళ్లంతా జూనియర్లకు అమ్ముడుపోతున్నారు. మరో రెండు, మూడు నెలల్లో పదోన్నతులు వస్తాయని, అప్పుడు మళ్లీ వారు అనుకున్న జిల్లాకు, ప్రాంతానికి తిరిగి వచ్చేయొచ్చని సీనియర్లు భావిస్తున్నారు. అందుకే ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్లేందుకు సీనియర్లు సిద్ధపడుతున్నారు. అటు డబ్బులకు డబ్బులు, ప్రమోషనొస్తే తిరిగి తమ ప్రాంతానికి వచ్చేయొచ్చనే ఆశతో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు డీలింగ్​కుదుర్చుకుంటున్నారు.

సహోద్యోగులే మధ్యవర్తిత్వం

మ్యూచువల్​బదిలీలకు సంబంధించిన సైట్​ఈ నెలాఖరుకు క్లోజయ్యే అవకాశాలుండటంతో మరిన్ని డీలింగ్స్​పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పలుకుతున్న రేటు కంటే అధికంగా పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. మ్యూచువల్​బదిలీల డీలింగ్స్‌కు పలువురు తోటి ఉపాధ్యాయులే తమకున్న పరిచయాల ద్వారా మధ్యవర్తిత్వం వహిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మండలస్థాయి అధికారులు సైతం మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు, సంబంధిత అధికారులను అడగ్గా ముడుపులు తీసుకోవడం, ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. కొందరి వల్ల ఉపాధ్యాయ వృత్తికి రిమార్క్​వచ్చే అవకాశాలున్నాయని వాపోతున్నారు.


Next Story