తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 31% రిజర్వేషన్

by Malleboina Mahesh |

మున్సిపల్​ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటికే ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా.. తాజాగా రిజర్వేషన్‌లను మున్సిపల్​శాఖ ఫైనల్ చేసింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 31% రిజర్వేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్​ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటికే ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా.. తాజాగా రిజర్వేషన్‌లను మున్సిపల్​శాఖ ఫైనల్ చేసింది. రాష్ట్రంలో 131 పట్టణ స్థానిక సంస్థలు(10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు) ఉండగా వాటన్నంటికీ రిజర్వేషన్‌లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్​శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి మున్సిపల్​రిజర్వేషన్‌ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. మేయర్, మున్సిపల్​చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్‌లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించనున్నారో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల వారీగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఆయా కలెక్టర్‌లు, మున్సిపాలిటీలకు అందించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగని గ్రేటర్​హైదరాబాద్, గ్రేటర్​వరంగల్, సిద్దిపేట, ఖమ్మం లాంటి వాటికి అన్నింటినీ కలిపి రిజర్వేషన్‌ల సంఖ్యను ఖరారు చేశారు. 10 మేయర్​స్థానాలు, 121 మున్సిపల్​చైర్మన్ స్థానాలు రాష్ట్రంలో ఉన్నాయి.

ఇందులో బీసీలకు 31 శాతం రిజర్వేషన్లు వచ్చినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మేయర్లలో బీసీలకు 30 శాతం, మున్సిపాలిటిల్లో 31.40 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఖరారు అయ్యాయి. పట్టణాల్లో ఎస్టీల జనాభా తక్కువగా ఉండటంతో ఆ రిజర్వేషన్లు బీసీలకు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లో బీసీలు ఎక్కువగా సీట్లు వచ్చాయి. మేయర్​లలో ఎస్టీ, ఎస్సీ ఒక్కొక్కటే రిజర్వేషన్లు అయ్యాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో మహిళలకు రిజర్వేషన్​కల్పించే అవకాశం రాలేదు. మేయర్‌లలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్​ కల్పించాల్సి ఉన్నందున జనరల్​ స్థానాల్లో మహిళలకు 4 మేయర్​ స్థానాలను ఖరారు చేయాల్సి వచ్చింది. దీంతో జనరల్ కేటగిరికి ఒకే మేయర్‌ స్థానం రిజర్వ్​అయింది.

మున్సిపల్​చట్టంలో పొందుపరిచిన విధంగా 50 శాతం మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉండటంతో అన్​రిజర్వ్ సీట్లలో మహిళలకు 4 స్థానాలు కేటాయించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన డెడికేటెడ్​కమిషన్​నివేదిక ప్రభుత్వానికి అందడంతో రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. ఈనెల 18న కేబినెట్ సమావేశం మేడారంలో జరగనుంది. అందులో ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్‌ను ఏ వర్గానికి రిజర్వ్​చేయాలో చర్చించి తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. అందుకు అనుగుణంగా అధికారులు రిజర్వేషన్ల జాబితాను ప్రకటిస్తారని తెలిసింది. మొత్తంగా ఫిబ్రవరి రెండో వారంలో పే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా సమాచారం. ఇందుకు అనుగుణంగా ఈ నెల చివరి వారం కల్లా నోటిఫికేషన్​ వస్తుందని తెలిసింది. 121 మున్సిపాలిటీల్లో 60 స్థానాలు మహిళలకు రిజర్వ్​చేశారు. 61 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో జనరల్‌కు కేటాయించారు.

ఓటరు జాబితా సిద్ధం..

మున్సిపల్​పోరులో కీలకమైన ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. ఈనెల 12న వార్డులు, డివిజన్ల వారీగా తుది జాబితాను ఇప్పటికే ప్రకటించింది. 16న పోలింగ్​ కేంద్రాల వారీగా తుది జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52.43 లక్షల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు , ఇతరులు 640 ఉన్నట్లుగా ప్రకటించారు. వీరి కోసం 8,195 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను బ్యాలెట్​విధానంలో జరపనున్నారు. బ్యాలెట్​పేపర్ల సీరియల్ నంబర్‌లను హైదరాబాద్​ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించనున్నారు.

గుర్తులు, అభ్యర్థుల ఫోటోలు, పేర్లు అన్ని ఆయా జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి. ఇందుకోసం ప్రింటింగ్​ ప్రెస్‌లకు సంబంధించి టెండర్లు పిలిచి అన్ని తనిఖీలు పూర్తి చేసి సిద్ధం చేసుకోవాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీచేశారు. పోలింగ్​ కేంద్రాల సంఖ్య ఖరారు అయినందున పోలింగ్, పోలీసు సిబ్బంది ఎంతమంది అవసరం ఉంటారు? వారిని ఎక్కడి నుంచి తీసుకుంటారనే విషయాలను వెంటనే ఖరారు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికల ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈనెల చివరి వారం కల్లా ఎన్నికల షెడ్యూల్ ​విడుదల కానుంది.



Next Story