2021లో రూ. 3.73 లక్షల కోట్లు పెరిగిన గౌతమ్ అదానీ సంపద!

by Disha Web Desk 17 |
2021లో రూ. 3.73 లక్షల కోట్లు పెరిగిన గౌతమ్ అదానీ సంపద!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆసియా రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న గౌతమ్ అదానీ గత ఏడాది తన సంపదను సుమారు రూ. 3.73 లక్షల కోట్లు పెంచుకున్నారు. ఈ కారణంగా ఆయన మొత్తం సంపద 81 బిలియన్ డాలర్ల(రూ. 6.17 లక్షల కోట్ల)కు చేరుకుంది. తాజాగా రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎంతో కలిసి హురున్ గ్లోబల్ రూపొందించిన సంయుక్త నివేదిక ప్రకారం.. 2021లో గౌతమ్ అదానీ గ్లోబల్ బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ల కంటే అధిక సంపదను పోగుచేసుకోవడం గమనార్హం. ఇక, భారత అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2021లో తన సంపదలో 24 శాతం వృద్ధితో రూ. 1.52 లక్షల కోట్ల వృద్ధిని సాధించారు. దీంతో ఆయన మొత్తం సంపద రూ. 7.8 లక్షల కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా ఆయన ప్రపంచంలోని టాప్-10 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచారు.

గత 10 ఏళ్లలో ముఖేష్ అంబానీ సంపద 400 శాతం వృద్ధి కాగా, గౌతమ్ అదానీ సంపద ఏకంగా 1,830 శాతం పెరిగింది. ఇక, హెచ్‌సీఎల్‌కు చెందిన శివ్ నాడార్ రూ. 2.13 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉండగా, రూ. 1.98 లక్షల కోట్లతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన సైరస్ పూనావాలా నాలుగో స్థానంలో, లక్ష్మీ మిట్టల్ రూ. 1.90 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ తన రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రీన్‌ని స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయడంతో 2020లో రూ. 1.30 లక్షల కోట్లుగా ఉన్న ఆయన సంపద ఐదు రెట్లు పెరిగి రూ. 6.17 లక్షల కోట్లకు చేరుకుంది.

2021లో నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ రూ. 57.8 వేల కోట్లతో హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ జాబితా-2022 లో కొత్తగా ప్రవేశించారు. గత 10 ఏళ్లలో భారత బిలియనీర్ల సంపద రూ. 53.32 లక్షల కోట్లు పెరిగాయని, ఇది స్విట్జర్లాండ్, యూఏఈల జీడీపీకి రెండు రెట్లకు సమానమని నివేదిక తెలిపింది. భారత్‌లో మొత్తం 215 మంది బిలీయనీర్లు ఉన్నారని నివేదిక వెల్లడించింది.


Next Story

Most Viewed