ఎక్సైజ్ శాఖకు కొత్త కళ.. ఏప్రిల్‌లో ముహూర్తం ఖరారు

by Disha Web Desk |
ఎక్సైజ్ శాఖకు కొత్త కళ.. ఏప్రిల్‌లో ముహూర్తం ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెస్తున్న ఆబ్కారీ శాఖ బైఫర్​కేషన్​కు సిద్ధమయ్యారు. ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రక్రియ వచ్చేనెలలో క్లియర్​ చేయాలని భావిస్తున్నారు. స్టేషన్ల విభజన పూర్తి చేసిన తర్వాతే బదిలీలు చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 14 కొత్త స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 12 ఉన్నాయి. ఎక్కువ ఆదాయం రావడంతో పాటుగా పరిధి ఎక్కువగా ఉన్న స్టేషన్ల నుంచి కొత్త స్టేషన్​ ఏర్పాటు చేయనున్నారు.

అప్పుడే పోస్టింగ్‌లు

ఎక్సైజ్‌లో వందల మంది అధికారులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్లు వచ్చినా బదిలీలు చేయలేదు. కొంతమంది ఖాళీగా ఉండి ఏండ్లు గడిచిపోతోంది. కొంతమందికి కనీసం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు స్టేషన్ల బైఫర్​కేషన్​చేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

గ్రేటర్​పరిధిలో శంషాబాద్, సరూర్​నగర్, హయాత్​నగర్, ఉప్పల్, ఘట్​కేసర్, మల్కాజిగిరి, అమీర్​పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్, మలక్​పేట, కుత్బుల్లాపూర్, లింగపల్లి స్టేషన్లు ఏర్పాటు కానుండగా, పఠాన్​చెరు స్థానంలో కూడా ఎక్సైజ్​ సర్కిల్​ స్టేషన్​ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా హన్మకొండ జిల్లా హన్మకొండలో మరో స్టేషన్​ కొత్తగా రానుంది.

ఏప్రిల్​ మొదటివారంలో ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత బదిలీలు చేయనున్నారు. కొత్త స్టేషన్ల ఏర్పాటుపై ఇప్పటికే నివేదికను సిద్ధం చేశారు. ప్రాంతాలను కూడా కొంత మేరకు ఖరారు చేశారు. వీటిని ఫైనల్​ చేసి, జీవో జారీ చేసిన తర్వాత అమల్లోకి రానున్నాయి.


Next Story

Most Viewed