ఏజీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలి: సుప్రీంకోర్టు

by  |
ఏజీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలి: సుప్రీంకోర్టు
X

ముంబయి: ఏజీఆర్ బకాయిల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది. కరోనా సమయంలో ఆదాయం ఆర్జించిన ఏకైక రంగం టెలికాం. ఈ సమయంలో ప్రభుత్వానికి నిధులు అవసరం ఉన్నందున టెలికాం కంపెనీలు ఏజీఆర్ బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘బకాయిల్లోంచి కొంత మొత్తం వెంటనే ప్రభుత్వానికి డిపాజిట్ చేయాలని, కరోనా సంక్షోభం వల్ల ప్రభుత్వం ఈ నిధులను ప్రజా ప్రయోజనాలకు వినియోగించడానికి అవసరమవుతాయని’ సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలను ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముందు వొడాఫోన్ ఐడియా తరఫున న్యాయవాది వాదనలను వినిపిస్తూ కంపెనీ వద్ద ప్రస్తుతానికి చెల్లించగలిగేంత నగదు లేదని, ఒకవేళ ఉన్నా దాంతో చెల్లిస్తే కంపెనీలోని 11వేల మంది ఉద్యోగులకు జీతాలను ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేదని, స్పెక్ట్రం, లైసెన్స్ ఫీజుల కోసం ఇప్పటికే రూ.15వేల కోట్ల విలువైన బ్యాంక్ గ్యారెంటీలను ప్రభుత్వానికి అందించినట్టు , ప్రతి ఏడాది రూ.5వేల కోట్లను చెల్లించాల్సి ఉన్నట్టు వొడాఫోన్ ఐడియా కోర్టు ముందు విన్నవించింది. బ్యాంకులు కంపెనీకి రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదని, చెల్లింపుల కోసం 20ఏళ్ల గడువు కావాలని కోరింది. ఈ అంశంపై తదుపరి విచారణను జూలై మూడో వారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

Next Story

Most Viewed