మెరుగ్గా టెలికాం కంపెనీల ఆదాయం

by  |
మెరుగ్గా టెలికాం కంపెనీల ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రంగంలోని కంపెనీల ఆదాయాలు సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగుపడతాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఈ త్రైమాసికంలో రీఛార్జీలతో పాటు కరోనా వల్ల ఏర్పడ్డ అంతరాయాలు తొలగిపోవడం వంటి అంశాలు టెలికాం కంపెనీలకు కలిసోస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. లాక్‌డౌన్ పరిమితులు సడలించడంతో వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్ల ఆదాయం రెండో త్రైమాసికంలో పెరిగిన రీఛార్జీలపై మెరుగ్గా ఉంటుందని యాక్సిస్ కేపిటల్ తన పత్రంలో పేర్కొంది.

జియో, భారతీ ఎయిర్‌టెల్ చందాదారులు పెరుగుతున్న క్రమంలో, వొడాఫోన్ ఐడియా చందాదారులు తగ్గిపోతున్నారు. ఈ క్రమంలోనే కంపెనీల ఆదాయాల పెరుగుదల మార్జిన్‌లో మార్పులుంటాయని విశ్లేషకులు తెలిపారు. జియో అధిక చందాదారుల చేరికతో పాటు అధిక వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం(ఆర్పు) వల్ల మెరుగైన లాభాలను పొందే వీలుందని యాక్సిస్ నివేదిక పేర్కొంది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఆదాయం రెండో త్రైమాసికంలో బలహీనంగా ఉన్నప్పటికీ, లాక్‌డౌన్ పరిమితుల సడలింపుతో రీఛార్జీలు మెరుగుపడి లాభాలను అందించే అవకాశాలున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో టెలికాం కంపెనీలకు మెరుగైనా ఆదాయాన్ని సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొన్నారు.

Next Story