ఆ ముగ్గురు గొడ్డళ్లతో బయలుదేరారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ఆ ముగ్గురు గొడ్డళ్లతో బయలుదేరారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇంట గెలవడంతో పాటు రచ్చ గెలవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే ఈసారి కూడా రేవంత్‌ను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సైతం గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గ రాజకీయం ఇటు రేవంత్ రెడ్డి అటు కేటీఆర్, హరీష్ రావుల ప్రచారంతో హీటెక్కుతోంది. ఈ క్రమంలో తాను పోటీ చేస్తున్న కొడంగల్ పాలిటిక్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట నుంచి ఒకడు, సిరిసిల్ల నుంచి ఇంకొకడు, గజ్వేల్ నుంచి మరొకడు కొడంగల్‌కు గొడ్డలి తీసుకుని బయలుదేరారని హాట్ కామెంట్స్ చేశారు. వాళ్ల మోచేతి నీళ్లు తాగిన వాళ్లంతా ఈ కుట్రలో భాగస్వాములై సహకరిస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా మంగళవారం ఈ కామెంట్స్ చేశారు.

కోస్గీ ప్రజలు రెండు సార్లు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. మీరు పెంచిన మొక్క వృక్షమై పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండే స్థాయికి చేరుకుంది. కానీ ఇప్పుడు కొడంగల్‌పై ఇతర ప్రాంతాల నుంచి గొడ్డలి తీసుకుని వస్తున్నారు. తెలంగాణ కోసం కొడంగల్ నుంచి రణం మొదలైందని దత్తత పేరుతో కేసీఆర్ ఈ ఐదేళ్లలో కొడంగల్‌ను కుక్కలు చించిన విస్తరిలా చేశారు. మన బతుకులు మారాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలి. గ్రూపులు, గుంపులు పక్కన పెట్టి కొడంగల్ ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్ చేసి మొత్తం ఒకే జిల్లాకు తేవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed