కాంగ్రెస్‌తో టచ్‌లోకి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్..? అసలు క్లారిటీ ఇదే..

by Dishafeatures2 |
కాంగ్రెస్‌తో టచ్‌లోకి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్..? అసలు క్లారిటీ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్‌ఎస్‌లో సీటు దక్కని నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. అలాగే బీజేపీలోని కొంతమంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తన్నారు. దీంతో ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్‌ల అంశం హాట్‌టాపిక్‌గా మారుతుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

రఘునందన్ రావు కాంగ్రెస్ గూటికి చేరుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. బీజేపీలో ఎప్పటినుంచో ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు మీడియా వేదికగా తన అసంతృప్తిని వెల్లగక్కారు. పార్టీ నేతలపైనే బాహాటంగా విమర్శలు కురిపించారు. దీంతో రఘునందన్ పార్టీ మారతారనే ఊహాగానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై రఘునందన్ స్పందించారు.

అలాంటి ఉద్దేశమే లేదు..

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రఘునందన్ రావు ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తితగా అవాస్తవమని కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెడతానంటూ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే సిద్దిపేటలో మంత్రి హరీష్ రావుపై అయినా పోటీ చేసేందుకు సిద్దమని ప్రకటించారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఈటల రాజేందర్, కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో బండి సంజయ్, కామారెడ్డిలో కేసీఆర్‌పై ధర్మపురి అర్వింద్ పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

జమిలీ ఎన్నికలతో మేలే

ఈ సందర్భంగా జమిలీ ఎన్నికలపై రఘునందన్ స్పందించారు. జమిలీ ఎన్నికల వల్ల తెలంగాణలో బీజేపీకి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికల వల్ల దేశానికి మంచి జరుగుతుందని, డబ్బు, సమయం ఆదా అవుతాయని స్పష్టం చేశారు. బీజేపీకి భయపడే సీఎం కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు ఆరోపించారు.


Next Story

Most Viewed