సిట్టింగ్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ముషీరాబాద్ BRS అభ్యర్థి ఖరారు?

by Disha Web Desk 2 |
సిట్టింగ్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ముషీరాబాద్ BRS అభ్యర్థి ఖరారు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కే అవకాశం దక్కుతుందా? ఆయన కుమారుడికి ఇచ్చే ఆలోచన ఉన్నదా? గతంలో టికెట్​ఆశించిన దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి బంధువుకు లభిస్తుందా? వీటికి ప్రత్యామ్నాయంగా కొత్త వ్యక్తి బరిలోకి దిగుతారా? ఇలాంటి అనేక సందేహాల నడుమ ఊహించని తీరులో హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరు తెరమీదకు వచ్చింది. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కొత్తగూడెం లోకల్ నియోజకవర్గం కావడంతో బీఆర్ఎస్ అధినేత అవకాశం ఇస్తే అక్కడి నుంచి పోటీ చేయాలని డాక్టర్ భావించారు. కానీ ఆ నియోజకవర్గాన్ని తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే ఇవ్వాలని పార్టీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

దీంతో కొత్తగూడెం నుంచి పోటీచేయడానికి డాక్టర్ శ్రీనివాసరావుకు అవకాశం లేకుండా పోయింది. కానీ రాజకీయాల్లో రావాలని ఆసక్తి చూపిస్తూ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసమే అన్ని రకాలుగా సిద్ధమవుతున్నందున ముషీరాబాద్ నుంచి అవకాశం కల్పించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అనారోగ్యం, వృద్ధాప్యం, ఆయన కుమారుడికి ఇంకా పాపులారిటీ లేకపోవడం తదితర కారణఆలతో ఈసారికి ఆ ఫ్యామిలీకి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ నియోజకవర్గంలో సామాజిక (కుల) సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేట్ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

గతంలో ఈ స్థానంలో బీజేపీకి చెందిన డాక్టర్ లక్ష్మణ్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నందున ఎమ్మెల్యేగా పోటీచేయకపోవచ్చని అంచనా. గతంలో డాక్టర్ లక్ష్మణ్‌ను ఆదరించిన ఓటర్లు అదే సామాజికవర్గానికి చెందిన డాక్టర్ శ్రీనివాసరావు వైపు మళ్ళే అవకాశాన్నీ బీఆర్ఎస్ నేతలు పరిగణనలోకి తీసుకున్నారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో డాక్టర్ ఇచ్చిన వీఆర్ఎస్ దరఖాస్తు సైతం ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్నది. కొత్తగూడెం నుంచి చాన్స్ రాకపోతే ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అభిప్రాయాన్ని కూడా గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వివరించారు. ఇప్పుడు కొత్తగూడెం అవకాశం దాదాపుగా చేజారిపోవడంతో ముషీరాబాద్ దక్కే అవకాశాలున్నాయి. డీహెచ్‌తో సంబంధం లేకుండా బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన చర్చలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఏర్పడనున్నది.

Next Story

Most Viewed