మేనిఫెస్టోపై బీజేపీ కసరత్తు.. కాంగ్రెస్‌కు దీటుగా ఉండాలని ప్లాన్

by Disha Web Desk 2 |
మేనిఫెస్టోపై బీజేపీ కసరత్తు.. కాంగ్రెస్‌కు దీటుగా ఉండాలని ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అలాగే అభ్యర్థుల ఎంపికపైనా స్పీడ్ పెంచనుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆలస్యంగా అయినా మేల్కొన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చేనెల 6వ తేదీన రాష్ట్ర పదాధికారులతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జులు హాజరుకానున్నారు. అదే రోజు అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోపై చర్చించనున్నారు.

ఇటు బీఆర్ఎస్ పథకాలు.. అటు కాంగ్రెస్ గ్యారెంటీలు..

వచ్చే ఎన్నికలలో అన్ని పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రజలకు చేరువకావడంపై దృష్టి సారిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షితులను చేయడం ఎలా అనే అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. కాగా బీఆర్ఎస్ పింఛన్ ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు, దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతానని హామీ ఇచ్చింది. ఇప్పటికే రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, గీత, నేత కార్మికులకు పింఛన్లు అందిస్తోంది. వచ్చే ఎన్నికలకు జాబ్ క్యాలెండర్, మహిళలందరికీ పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే సిక్స్ గ్యారెంటీస్ పేరిట హామీలను ప్రకటించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ. 2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే రైతు భరోసాలో భాగంగా ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, కూలీలకు రూ.12 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసంలో భాగంగా స్టూడెంట్స్ కు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించింది.

మనం ఎలాంటి హామీలిద్దాం..?

ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన జరిగే రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ సైతం ప్రజలకు ఎలాంటి హామీలు, పథకాలు అందించాలనే విషయమై నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కేంద్రం తెలంగాణకు ఏమివ్వబోతోందనే అంశం కూడా చర్చకు రానుంది. కాగా బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు దీటుగా హామీలు ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే పలు ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. వాటితోపాటు ప్రజలకు చేరువయ్యే ఇతర పథకాలపైనా దృష్టి పెట్టాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంపై పోరాడుతున్న పార్టీ నిరుపేదలకు పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లను ఇవ్వాలని చూస్తోంది. అలాగే ఇదే మీటింగ్ లో అభ్యర్థుల ఎంపికపైనా చర్చ జరగనుంది. ఇప్పటికే 6 వేలకు పైగా ఆశావహులు పోటీ కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఎవరిని రంగంలోకి దింపితే బాగుంటుందనే అంశంపై నడ్డా ఆరా తీయనున్నారు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read More..

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కారు మరో కొత్త పథకం.. ప్రధాని ఫొటో చిన్నగా, కేసీఆర్ ఫొటో పెద్దగా?

Next Story

Most Viewed