40 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేశా.. నాలుగేళ్లలో నాశనం చేశారు: తుమ్మల

by Disha Web Desk 2 |
40 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేశా.. నాలుగేళ్లలో నాశనం చేశారు: తుమ్మల
X

దిశ, ఖమ్మం సిటీ: కమ్మ మహాజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎర్నేని రామారావు కాంగ్రెస్ చేశారు. శనివారం తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని ఈఆర్ఆర్ రిసార్ట్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎర్నేని రామారావు పార్టీలో చేరడం శుభసూచకమన్నారు. ఖమ్మం అభివృద్ధిలో ఎర్నేని కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై పోరాడిన చరిత్ర ఆయనకు ఉందన్నారు. ఖమ్మం ఎమ్మెల్యేగా తాను ఎన్నికైనప్పుడు నగరంలో తాగునీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితిని గుర్తుచేశారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నాటి ముఖ్యమంత్రి, మంత్రులతో కొట్లాడి పుట్టకోట, దానవాయిగూడెం, లకారం తాగునీటి పథకాలతో సురక్షిత మంచినీరు అందించానని చెప్పారు. విద్య, వైద్యం, ఇతర రంగాల అభివృద్ధిలో తనవంతు ప్రయత్నం చేశానన్నారు.


ఖమ్మంతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులకు, మారుమూల ప్రాంతాలకు పరిష్కారం చూపానన్నారు. గడిచిన ఐదేళ్లలో సీతరామా ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని తెలిపారు. 40 ఏళ్లు కష్టపడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశానని.. దానిని నాలుగేళ్లలో నాశనం చేశారని మండిపడ్డారు. తనకు పదవులు అసవరం లేదని.. అరాచక, అవినీతి పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లను కాంగ్రెస్ క్లీన్ స్వీ్ప్ చేయబోతోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో చేరి సీతారామ, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని మీ ముందుకు వచ్చానన్నారు. పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఖమ్మంలో అరాచకాలను అడ్డుకునేందుకు ఎవరొస్తారా? ఎదురుచూశామని, తుమ్మల వంటి అగ్ర నాయకుడు రావడంతో ప్రజలు ధైర్యంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, దయాకర్రెడ్డి, వీరభద్రం, నిరంజన్రెడ్డి, కమర్తపు మురళీ, చావా నారాయణరావు, సైదుబాబు పాల్గొన్నారు.

Next Story

Most Viewed