బీఆర్ఎస్ లీడర్లను గూండాలంటూ సీపీఎం తమ్మినేని సీరియస్

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్ లీడర్లను గూండాలంటూ సీపీఎం తమ్మినేని సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముందస్తు పథకం ప్రకారం ఇవాళ ఉదయం ఐదు గంటలకు తూర్పు వరంగల్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తన వంద మంది గూండాలను తీసుకొచ్చి గుడిసె వాసులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఈ మేరకు గురువారం తమ్మినేని ఓ ప్రకటన విడుదల చేశారు. జక్కలొద్ది ప్రాంతంలోని పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చి, గద్దెలను, సీపీఎం జెండాలను తొలగించి బలవంతంగా బీఆర్‌ఎస్‌ జెండాలను కట్టి నాయకులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్‌, గణపాక ఓదేలు, ప్రత్యూషపై తప్పుడు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న గుడిసెలను పీకేస్తామని, గుడిసెవాసులంతా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని, కండువాలను కప్పుకోవాలని బెదిరించారని, లేదంటే గుడిసెలన్నింటినీ నేలమట్టం చేస్తామని బెదిరించారని వెల్లడించారు. పేదలపై కక్షపూరితంగా వ్యవహరించారని, ఎన్నికల సమయంలో అధికారపార్టీ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులను బెదిరింపులకు పాల్పడుతున్నారని, తక్షణమే పేదల గుడిసెలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Next Story