మా కార్లు మాకు అప్పగిస్తే సరిపోదు: కాంగ్రెస్

by Disha Web Desk 2 |
మా కార్లు మాకు అప్పగిస్తే సరిపోదు: కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నినాదాలు రాసిన కార్లను పోలీసులు ఎత్తుకెళ్ళడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. పార్టీ ఆఫీసుగా నడుస్తున్న గాంధీ భవన్ ప్రాంగణంలో పెట్టిన కార్లను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈనెల 4న పోలీసులు తీసుకెళ్ళడం అధికార దుర్వినియోగమని వ్యాఖ్యానించింది. ఆ కార్లను తిరిగి తమకు అందజేయడం మాత్రమే కాక స్వాధీనం చేసుకున్న పోలీసులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రైవేటు భవన ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించి కార్లను తీసుకెళ్ళడం చట్ట ఉల్లంఘనేనని, ఏ అధికారంతో వీటిని తీసుకెళ్ళారో దర్యాప్తు జరిపించాలని ఆ కంప్లైంట్‌లో కోరారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రాపర్టీని పోలీసులు ఏ నిబంధన ప్రకారం తీసుకెళ్ళారని ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఇప్పటికీ నిర్దిష్టమైన వివరణ ఇవ్వకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు రాసుకోవడం, వ్యతిరేకతను ప్రదర్శించడం, అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య పరిధిలోనే జరిగిందని వివరించారు. పోలీసులు వారి అధికారాన్ని మీరి గాంధీభవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి కార్లను స్వాధీనం చేసుకోవడంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.



Next Story

Most Viewed