మునుగోడుపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. కీలక కాంగ్రెస్‌ నేతకు గాలం!

by Disha Web Desk 2 |
మునుగోడుపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. కీలక కాంగ్రెస్‌ నేతకు గాలం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి హస్తం పార్టీలో చేరారు. దీంతో మునుగోడులో అభ్యర్థి కోసం బీజేపీ వేట మొదలుపెట్టింది. ఆ స్థానం నుంచి గతంలో పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పోటీ చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయంపై కమలం పార్టీ ఫోకస్ చేస్తోంది. మునుగోడులో కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థి ఉండడంతో అన్ని రాజకీయ సమీకరణాలను ఆలోచించిన తర్వాతే సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని నేతలు యోచిస్తున్నారు.

కాంగ్రెస్‌ను వీక్ చేయాలంటే కాంగ్రెస్‌కు చెందిన నేతను తమ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డికి గాలం వేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఆయన చేరితే ఒకే.. లేదంటే ఆ స్థానాన్ని ఓబీసీ మోర్చాకు చెందిన నేత వీరమల్ల అనిల్ కుమార్ గౌడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడులో బీసీ ఓట్లు అధికంగా ఉండటంతో గౌడ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్‌ను బరిలోకి దించితే ఎలా ఉంటుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అనిల్ కుమార్‌ గౌడ్ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ అల్లుడు కావడం గమనార్హం. చంద్రశేఖర్ ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

Next Story

Most Viewed