హిందూ దేవాలయాల చెక్ పోస్టుల వద్ద డబ్బులు వసూలు దందా ఆపాలి.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

by Disha Web Desk 13 |
హిందూ దేవాలయాల చెక్ పోస్టుల వద్ద డబ్బులు వసూలు దందా ఆపాలి.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేవాలయాల దగ్గర వెళ్లే దారిలో చెక్ పోస్టులు అంటూ అటవీ శాఖ డబ్బులు వసూలు చేస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ హెచ్చరించారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని నాగర్‌కర్నూల్ జిల్లా డీఎఫ్ఓ కార్యాలయంలో ఐఎఫ్ఎస్ రోహిత్‌ రెడ్డిని కలిసి డిమాండ్స్‌తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సింకారు శివాజీ మాట్లాడుతూ.. హిందూ దేవాలయాల చెక్ పోస్టుల వద్ద డబ్బులు వసూలు దందా ఆపాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని బౌరాపూర్ జాతరకు వెళ్లే భక్తుల వాహనాల దగ్గర డబ్బులు వసూలు చెయ్యడం ఆపాలన్నారు.


శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బౌరాపూర్ జాతరకు వెళ్లే వాహనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రకటన జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌరాపూర్ జాతరకు వాహనాలలో వెళ్లే భక్తుల దగ్గర బైక్ 40, ఆటో 300, ట్రాక్టర్ 400, కార్ 500 ఈ విధంగా భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రోజురోజుకు హిందూ దేవాలయాలకు భక్తులను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉమామహేశ్వరం, మద్దిమడుగు దేవాలయాలకు వెళ్లే రహదారుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎత్తి వెయ్యకుండా ప్రతి రోజు డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.


బౌరాపూర్ జాతరకు వెళ్లే వాహనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. ఉమామహేశ్వరం దేవాలయానికి శివరాత్రి రోజు వేల సంఖ్యలో భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారని, వారి దగ్గర చెక్‌పోస్టులు పెట్టి డబ్బులు అడగటం ఎంత వరకు న్యాయమని అన్నారు. దేవాదాయ, అటవీ శాఖ, న్యాయ శాఖ ఈ మూడు శాఖలకు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఒక్కడే అని, ఎందుకు ఈ దోచుకునే కుట్రలు కనపడటం లేదన్నారు.


భక్తుల దగ్గర అన్యాయంగా వసూలు చేస్తున్న డబ్బులు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఈ విధంగా భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి సంపాదించుకుంటున్నారు అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యువసేన ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, విద్యార్థిసేన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మారుతి, యువసేన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు విష్ణు, విద్యార్థిసేన నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, బీవీఎస్ అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed