కేసీఆర్ పాలనలో జనాలకు ఆత్మహత్యలే శరణ్యం.. YSRTP Chief YS Sharmila

by Javid Pasha |   (  Updated:2023-07-15 11:18:09  IST  )

కేసీఆర్ పాలనలో జనాలకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు.

YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ పాలనలో జనాలకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఉరితాళ్లే దిక్కయ్యాయని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, జీతాలు రాక ఉద్యోగులు లేఖలు రాసి మరీ ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పథకాలు దక్కాలన్నా గుండెలు ఆగాల్సిందేనని అన్నారు. జీతాలు, పథకాల కోసం జనాలు చేసుకునే ఆత్మహత్యలు దొర బంగారు పాలనకు నిదర్శనం అని ఎద్దేవా చేశారు.

‘‘నల్లగొండలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన దంపతులను పొట్టనపెట్టుకున్న పాపం బందిపోట్ల అధ్యక్షుడు కేసీఆర్ దే. గతంలో జీతాలు రావడం లేదని భర్త మహేశ్ ఆత్మహత్య చేసుకుంటే.. భార్య పుష్పలత సైతం అదే కారణంతో ప్రాణాలు విడిచింది. అనాథలైన ఇద్దరి బిడ్డల శాపం ఈ సర్కారుకు కచ్చితంగా తగులుతుంది. అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పే మంత్రి హరీష్ రావుకైనా మిషన్ భగీరథ కార్మికుల కష్టాలు పట్టడం లేదు. ఇక చిన్న దొర ఇలాకాలో ఇల్లు రాలేదని చనిపోయిన రాజు మృతికి కేటీఆర్ బాధ్యత వహించాలి’’ అని ఆమె ట్వీట్ లో డిమాండ్ చేశారు.

సిరిసిల్లలో ప్రభుత్వ పథకాలు అందని గడపే లేదని చెప్పుకునేందుకు సిగ్గుపడాలన్న ఆమె.. రాష్ట్రాన్ని నడిపేందుకు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినా పథకాలకు డబ్బు లేదని చెప్పారు. జీతాలు ఇవ్వడానికి, పెంచడానికి రూపాయి లేదని, బంగారు తెలంగాణలో దొర కుటుంబం బంగారమైతే.. పేదలకు బ్రతుకు భారమైందని అన్నారు. మిషన్ భగీరథలో పని చేసే 16 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాన్ని పెంచాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకో కుటుంబం ప్రాణాలు తీసుకోక ముందే కేసీఆర్ తన మొద్దు నిద్ర వీడాలని అన్నారు.

Next Story