కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ మెగా మోసం: YS షర్మిల ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ మెగా మోసం: YS షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​హామీలు మోసమని ఇదివరకే రాష్ట్ర ప్రజలు గ్రహించారని.. ఇక రిటర్నింగ్ అధికారులకు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ మెగా మోసమని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అఫిడవిట్లో సెంటు భూమి, సొంత కారు కూడా లేదని పేర్కొన్నారని.. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎక్కడా లేకపోవచ్చని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వేల అబద్దాలు ఆడే కేసీఆర్.. ఈ అఫిడవిట్‌లో మాత్రం నిజాలెందుకు చెప్తారని వ్యాఖ్యానించారు.

ధనిక రాష్ట్రానికి పేద ముఖ్యమంత్రి.. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆమె అభివర్ణించారు. కాళేశ్వరం కమీషన్లు ఎక్కడ దాచుకున్నారో.. సర్కారు భూములు అమ్మిన సొమ్ము ఎవరి జేబులు నింపారో తెలపాలని డిమాండ్ చేశారు. అబద్దాలు ఆడితే అతికినట్లు ఉండాలని చురకలంటించారు. పదేళ్లుగా ప్రతి పథకంలో తెలంగాణ సొమ్మును అందిన కాడికి దోచుకున్న కేసీఆర్​ అండ్ కో అఫిడవిట్‌లో చూపిస్తున్న ఆస్తులు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శించారు.

Next Story