డీకే శివకుమార్‌తో YS షర్మిల భేటీ.. 15 రోజుల్లో రెండోసారి!

by Disha Web Desk 2 |
డీకే శివకుమార్‌తో YS షర్మిల భేటీ.. 15 రోజుల్లో రెండోసారి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె మరోసారి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. సోమవారం షర్మిల డీకే శివకుమార్‌తో సమావేశం అయ్యారు. బెంగళురులో డీకేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డీకే ఎంతో శ్రమించారని కష్టానికి తగిన ఫలితం దక్కిందని షర్మిల పుష్పగుచ్చం ఇచ్చి డీకేను అభినందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని షర్మిలతో డీకే గుర్తు చేశారు. కాగా ఇటీవల డీకే పుట్టిన రోజు సందర్భంగా షర్మిల బెంగళూరుకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. అయితే 15 రోజుల్లో డీకేతో షర్మిల రెండు సార్లు భేటీ కావడం హాట్ టాపిక్ అవుతోంది.

కాంగ్రెస్‌తో పొత్తు కోసమేనా?:

డీకే శివకుమార్‌తో షర్మిల వరుస భేటీలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారుతున్నాయి. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని అది సాధ్యం కాని పక్షంలో పొత్తు పెట్టుకుని కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇచ్చే విషయంలో చర్చ జరుగుతోందనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్, జగన్ లక్ష్యంగా షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ వ్యవహారాన్ని స్వయంగా ప్రియాంక గాంధీనే పరిశీలిస్తున్నారనే ఊహాగానాలు గత కొంత కాలంగా తెలుగు పాలిటిక్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చే విషయాన్ని డీకే ద్వారా అధిష్టానం డీల్ చేస్తోందనే టాక్ ఉంది.

ఈ క్రమంలోనే ఆమె వరుసగా కర్ణాటకకు వెళ్లి మరి శివకుమార్‌తో సమావేశం అవుతోందనే ప్రచారం గుప్పుమంటోది. అయితే వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనే ప్రచారంపై షర్మిల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. విలీనం చేసేందుకు తాను పార్టీ పెట్టలేదని చెప్పారు. కాగా షర్మిలకు బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయని ప్రస్తుతం అక్కడ కర్ణాటక ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతం నుంచి తమ కుటుంబానికి డీకే కుటుంబానికి ఉన్న అనుబంధం కారణంగా ఆమె మర్యాదపూర్వకంగా కలుస్తోందనేది వైఎస్సార్ టీపీ వర్గాలు పైకి చెబుతున్నప్పటికీ షర్మిల తీరు సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూనే కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్‌ను మాత్రం షర్మిల ఆకాశానికెత్తడం అంతుచిక్కని వ్యవహారంగా మారుతోంది. దీంతో షర్మిల వరుస భేటీల వెనుక రాజకీయ మతలబు ఏంటీ అనేది చర్చనీయాంశంగా మారుతోంది.

YS.Sharmila met karnataka deputy cm DK Shivakumar at Bangalore


Next Story

Most Viewed