యువ సివిల్ ఇంజినీర్లు వినూత్నంగా ఆలోచించాలి : మంత్రి శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

యువ సివిల్ ఇంజినీర్లు వినూత్నంగా ఆలోచించాలి : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని, ఈ ప్రయాణంలో సివిల్ ఇంజనీర్లు భాగస్వామ్యం కావాలని కోరారు. మూడున్నరేళ్లలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్(హైదరాబాద్) సెంటర్ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్- జెన్ హైరైస్ బిల్డింగ్స్ (అడ్వాన్స్మెంట్స్ ఇన్ కాంపోజిట్, స్టీల్ స్ట్రక్చర్స్) అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి రేటును నమోదు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ. 80,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చింది. రాష్ట్ర సేవల స్థూల విలువ జోడింపులో ఇది 24.9 శాతం. ఈ గణాంకాలు తెలంగాణ నిర్మాణ రంగ ప్రగతికి నిదర్శనం అని మంత్రి వివరించారు. ఇటీవల కాలంలో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైరైస్ భవన నిర్మాణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మన హైదరాబాద్‌లో 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న

భవనాల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉంది. మరో 250 భవనాల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే మనం పర్యావరణహితంగా అడుగులు వేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ తరహ భారీ భవనాల నిర్మాణంలో రీన్‌ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్(ఆర్ సీసీ) నిర్మాణాలకు బదులుగా కాంపోజిట్, స్టీల్ స్ట్రక్చర్స్ కు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. కంపోజిట్ స్టీల్ స్ట్రక్చర్స్ వినియోగం వల్ల భవనం పూర్తయ్యేందుకు పట్టే సమయం 40 శాతం, భారం 30 శాతం తగ్గుతుంది. భూకంపాలను సమర్థవంతంగా తట్టుకోగలవు. నిర్మాణ సమయంలో వెలువడే కాలుష్యం తగ్గుతుంది. మరీ ముఖ్యంగా పునర్వినియోగం వల్ల సర్క్యులర్ ఎకానమీ వృద్ధి చెందుతుంది అని చెప్పారు. తెలంగాణలో ఆవిష్కరణలు కేవలం మాటలకే పరిమితం కావడం లేదు. ఆచరణలోనూ చూపిస్తున్నాము.

భావితరాల కోసం కాంపోజిట్ స్టీల్ స్ట్రక్చర్స్ నిర్మాణాలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చిన స్టీల్ వంతెనలు గొప్ప ఉదాహరణ. నిర్మాణ రంగంలో ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం, బిల్డ్ నౌ పోర్టల్ ద్వారా నిర్మాణ అనుమతుల్లో వేగం, జవాబుదారీతనం, విశ్వాసాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం అని పేర్కొన్నారు. కాంపోజిట్ స్టీల్ హై-రైజ్ డిజైన్‌పై జాతీయస్థాయిలో ఒకే రకమైన మార్గదర్శకాలు(కోడ్) తెచ్చేలా కేంద్రం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాడర్డ్స్ (బీఐఎస్)తో కలిసి పని చేస్తామన్నారు. సాంప్రదాయబద్ధంగా కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వినూత్నంగా ఆలోచించాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఎల్లపుడూ సిద్ధంగా ఉంటుందని యువ సివిల్ ఇంజనీర్లకు సూచించారు. స్మార్ట్ నగరాలు, స్థిరమైన గృహనిర్మాణం, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ప్రతినిధులు ఎస్ జీఎస్ మూర్తి, మహేందర్ రెడ్డి, శేషాద్రి, కాశీరాం, నర్మదా, రమేష్, భీం రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story