మిల్లెట్ వ్యాపారులుగా మహిళలు

by Disha Web Desk 2 |
మిల్లెట్ వ్యాపారులుగా మహిళలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని ఆగ్రోస్‌ సంస్థ వంద మంది మహిళలను మిల్లెట్‌ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌)లో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వందకు పైగా ఔత్సాహిక మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్‌ చైర్మన్‌ విజయసింహారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్‌ హనుమంతు, ఆగ్రోస్‌ ఎండీ రాములు, అక్షయపాత్ర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు ప్రభుత్వరంగ సంస్థ టీఎస్‌ ఆగ్రోస్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మార్కెట్లో డిమాండ్‌ గల చిరు ధాన్యాల ఉత్పత్తుల వ్యాపారంలో వారిని భాగస్వామ్యులను చేయాలని, స్టార్టప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వారితో రాష్ట్ర వ్యాప్తంగా చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తులను విక్రయించేందుకు ఔట్‌లెట్స్‌ ను ఏర్పాటు చేయిస్తారు. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఒకటి లేదా రెండు చొప్పున, జీహెచ్‌ఎంసీ పరిధిలో పది ఔట్‌లెట్స్‌ ను ఏర్పాటు చేయాలని ఆగ్రోస్‌, అక్షయపాత్ర నిర్ణయించాయి.

Next Story

Most Viewed