బీజేపీ నేతలేవరైనా ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా: సొంత పార్టీ లీడర్లపై తుల ఉమ ఆగ్రహం

by Disha Web Desk 19 |
బీజేపీ నేతలేవరైనా ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా: సొంత పార్టీ లీడర్లపై తుల ఉమ ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: చివరి నిమిషంలో తనకు టికెట్ నిరాకరించడం పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న వేములవాడ బీజేపీ నేత తుల ఉమ సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. పార్టీలో బీసీలను అణగదొక్కాలనే ప్రయత్నం జరుగుతున్నదని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులెవరైనా తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన అనుచరులతో సమావేశం అయిన తుల ఉమ.. తనలాంటి వారిని మోసం చేయడానికి వారికి సిగ్గుండాలి. ఎవరో చెప్పిన గాలిమాటలు విని నన్ను రాజకీయంగా బొందపెట్టాలని చూస్తున్నారని.. నాతో మాట్లాడే ధైర్యం కూడా బీజేపీ నేతలకు లేదని ఫైర్ అయ్యారు. బీజేపీలో మహిళలకు స్థానం లేదని.. నమ్మించి తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం అని అన్నారు. కానీ బండి సంజయ్ దొరల కాళ్ల వద్ద వేములవాడ బీ ఫామ్ పెట్టి వచ్చారని మండిపడ్డారు.

బీసీ సీఎం నినాదం అంతా ఓ బూటకం అన్నారు. తాను దొరల వద్ద చేతులు కట్టుకు కూర్చొలేనని.. కా కళ్లలో కన్నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. బీజేపీలో సిద్ధాంతాలు అనేవి లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన భవిష్యత్ కార్యచరణ త్వరలోనే ప్రకటిస్తానన్నారు. కాగా వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తొలుత తుల ఉప పేరును పార్టీ అనౌన్స్ చేసింది. ఆమెను నామినేషన్ వేసుకోవాలని సూచించింది. దీంతో నామినేషన్లకు చివరి రోజైన నిన్న కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి బయలుదేరిన ఉమకు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. చివరి నిమిషంలో ఉమ స్థానంలో విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు టికెట్ ఖరారు చేసింది. ఈ హఠాత్ పరిణామంతో ఖంగు తిన్న ఉమ నామినేషన్ వేసి వచ్చాక కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీని వీడుతారానే ప్రచారం జరుగుతోంది.

Next Story